సుందర్ పిచాయ్ నియామకం: అసలు కారణం ఇదేనా?
న్యూయార్క్: అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు సీఈఓగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నియామకం వెనక ఆసక్తికర స్టోరీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సుందర్ పిచాయ్ నాయకత్వంలో అక్టోబర్ నుంచి గూగుల్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
కాగా, క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించి, గూగుల్ ప్రొడక్షన్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఇండియన్ ఒక్కసారిగా సంస్థ సీఈఓగా అవతరించడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ సహా కొన్ని దిగ్గజ సంస్థలు సమర్థులైన అధిపతుల అన్వేషిస్తున్నాయి. ఇప్పటి పోటీ ప్రపంచంలో సత్తా ఉన్నవాడైతేనే సంస్థను రాకెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లగలడని ఆయా సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి.
ఈ క్రమంలో ట్విట్టర్.. సుందర్ పిచాయ్కు సీఈఓ పోస్టు ఆఫర్ చేసిందన్న వార్తలు వచ్చాయి. దీంతో గూగుల్ కలవరపాటుకు గురైంది. పిచాయ్ సామర్థ్యం ఎంటో గూగుల్కు తెలుసు. కాబట్టి ఎలాగైనా తమ సంస్థలోనే పిచాయ్ను ఉండేలా చూడాలనుకుంది.
ఈ నేపథ్యంలో గూగుల్ పిచాయ్ను తమ వద్దే అట్టిపెట్టుకోవాలంటే ఏంచేయాలో అదే చేసింది. ఏకంగా సంస్థకు సీఈఓగా నియమించి ట్విట్టర్కు నిరాశను మిగిల్చింది. కాగా, ఈ స్టోరీ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.