ఖలిస్తాన్, వేర్పాటువాద కాశ్మీరీల దురాగతం: ప్రవాస భారతీయులను చితకబాదిన వైనం
లండన్: లండన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్, కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ప్రవాస భారతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లే తరిమి కొట్టారు. అల్లా హో అక్బర్, నారా-ఇ-తక్దీర్ అంటూ నినాదాలు చేశారు. ఈ తతంగం అంతా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుటే చోటు చేసుకుంది.
ప్రత్యేక పంజాబ్ దేశం కోసం ఖలిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఖలిస్తాన్ ఆవిర్భవించినదే ప్రత్యేక పంజాబ్ కోసం. వారికి కాశ్మీర్ వేర్పాటువాదులు, ఈ తరహా సంఘాల నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయి. ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
లండన్ సహా పలు దేశాల్లో ఖలిస్తాన్ వేర్పాటు వాదులు నివసిస్తున్నారు. లండన్ లో కూడా వారి సంఖ్య భారీగా ఉంటోంది. శనివారం ఖలిస్తాన్, ప్రత్యేక కాశ్మీర్ వేర్పాటువాదులు లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భారత్ లో మైనారిటీలపై దాడులు తీవ్రం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. బైఠాయించారు.
లండన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఓవర్సీస్ పాకిస్తానీస్ వెల్ఫేర్ కౌన్సిల్ అండ్ సిక్స్ ఫర్ జస్టిస్, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి.
వేర్పాటువాదుల నినాదాలు కొనసాగుతున్న సమయంలో.. వివిధ పనుల కోసం పలువురు ప్రవాస భారతీయులు భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే వేర్పాటువాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. అల్లా హో అక్బర్ అని నినాదాలు చేశారు. దాడులకు దిగారు. తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులతో ప్రవాస భారతీయులను చితకబాదారు. భయంతో పరుగులు పెట్టిన వారిని కూడా వదల్లేదు. తరిమికొట్టారు. వెంటాడి, పట్టుకుని, పిడిగుద్దులు గుప్పించారు.
ఖలిస్తాన్ అనుకూల ఆందోళనకారులు పంజాబీయుల తరహాలో తలపాగాలు ధరించి ఈ నిరసనల్లో పాల్గొన్నారు. భారత్ కు వ్యతిరేకంగా నినదించారు. 'అల్లాహో అక్బర్', 'నారా ఏ తక్బీర్' అంటూ నినాదాలు చేశారు. దాడుల సమయంలో వారి చేతుల్లో ఖలిస్థాన్ జెండాలు కనిపించాయి.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ దాడులతో ప్రవాస భారతీయులు ఆందోళనకు గురయ్యారు. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. వెంటాడి చితగ్గొట్టారు. ఫలితంగా- పలువురు ప్రవాస భారతీయులు గాయపడ్డారు. దాడులను గమనించిన భారత హైకమిషన్ కార్యాలయం భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఖలిస్తాన్, కాశ్మీరీలను అదుపులోకి తీసుకున్నారు. దీనితో సంఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH Pakistan’s ISI backed Khalistanis attacked a number of British Indians who were standing outside the Indian High Commission in London on March 9. The men wearing Sikh turbans raised slogans 'Naraa-e-Taqbeer' & 'Allah-u-Akbar' pic.twitter.com/7L5Fume7nv
— ANI (@ANI) March 10, 2019