ఆ ఆత్మాహూతి దాడులు మా పనే: ఐసిస్ ప్రకటన: కలకలం పుట్టిస్తున్న తాజా వీడియో!
కొలంబో: ఉనికిని కోల్పోయిందనుకున్న భయానక ఉగ్రవాాద సంస్థ ఐసిస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. శ్రీలంకలో నరమేథానికి తామే కారణమని ప్రకటించుకుంది. చర్చ్ లపై ఆత్మాహూతి దాడులు చేసింది తామేనని వెల్లడించింది. ఈ మేరకు ఐసిస్ అధికారిక వెబ్ సైట్.. అల్-అమక్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఐసిస్ చీఫ్ పేరరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ సందేశాన్ని జారీ చేసినట్లు అల్-అమక్ ప్రకటించింది. శ్రీలంకలో క్రైస్తవులు, పాశ్చాత్య ప్రజలపై చోటు చేసుకున్న పరిణామాలకు ఇస్లామిక్ స్టేట్ యోధులే కారణం..అనేది స్థూలంగా ఆ సందేశానికి సంబంధించిన సారాంశం. ఈ రక్తపాతం మీకు రివార్డుగా ఇస్తున్నాం.. అంటూ మరో వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోను అల్ ఘురాబా మీడియా ప్రసారం చేసింది. ఈ మీడియా సంస్థను ఐసిస్ సానుభూతిపరులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అబుల్ బర్రా, అబుల్ ముఖ్తార్, అబు ఉబైదా పేర్లతో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఈ వీడియోలో ముసుగులు వేసుకుని కనిపించారు.
ఈ ముగ్గురిలో అబూ ఉబైదా అనే ఉగ్రవాది అసలు పేరు జహ్రెయిన్ హాషిమ్ అని, నేషనల్ తౌహీత్ జమాత్ సంస్థలో కీలక సభ్యుడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కొలంబోలోని షాంగ్రిలా హోటల్ పై జహ్రెయిన్ స్వయంగా ఆత్మాహూతి దాడి చేసినట్లు సమాచారం. ముస్లిం మత ప్రబోధకుడిగా జహ్రెయిన్ పనిచేసే వాడని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో మసీదులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మందికి మృత్యువాత పడిన ఘటనకు ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్లుగా ఐసిస్ ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ- క్రైస్ట్ చర్చ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఉగ్రవాదులు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని శ్రీలంక రక్షణ శాఖ సహాయమంత్రి రువాన్ విజేవర్ధనె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈస్టర్ సండే నాడు రాజధాని కొలంబో సహా వేర్వేరు ప్రాంతాల్లోని చర్చ్ లు, హోటళ్లపై చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడుల్లో 321 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 500 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈ దాడుల అనంతరం దర్యాప్తును ముమ్మరం చేసిన శ్రీలంక పోలీసులు, భద్రతా బలగాలు సిరియా జాతీయుడిని అరెస్టు చేశాయి. దీనితో- ఐసిస్ తో సంబంధాలు ఉండి ఉండొచ్చంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ.. తాజాగా ఐసిస్ ఈ సందేశాన్ని, వీడియోను అధికారిక వెబ్ సైట్ లో ప్రచురించింది. శ్రీలంక మారణకాండకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. తమ ఆత్మాహూతి దళ సభ్యులు ఈ దాడులు చేశారంటూ ఓ సందేశాన్ని తమ అధకారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది.
మొదట్లో శ్రీలంకకే చెందిన నేషనల్ తౌహీత్ జమాత్ అనే ర్యాడికల్ సంస్థ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థకు ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు, భారత్ లో సక్రియంగా ఉన్నట్లుగా భావిస్తోన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. కొలంబోలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సిరియా జాతీయుడిని పోలీసులు అరెస్టు చేయడం, ఆ వెంటనే- ఆత్మాహూతి దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటిచండం వంటి పరిణామాలు వెంటవెంటనే చోటు చేసుకున్నాయి.
#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
— ANI (@ANI) April 23, 2019
మరో వీడియో..
ఆత్మాహూతి దళ సభ్యునిగా అనుమానిస్తోన్న యువకుడొకడు భుజానికి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని, క్రిక్కిరిసిన చర్చ్ లో ప్రవేశిస్తోన్న తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కొలంబోలో బాంబు దాడికి గురైన ఓ చర్చ్ ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ యువకుడు ఈస్టర్ సండే సందర్భంగా చర్చ్ వద్ద వందల సంఖ్యలో భక్తులు గుమికూడి ఉండగా.. వారిని దాటుకుని చర్చిలోనికి ప్రవేశిస్తున్న దృశ్యాలు తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
13) Earlier today, #ISIS-linked chat groups distributed pics allegedly of “the commando brothers in Sri Lanka,” noting the ISIS-affiliated banner behind them. The source of the pictures is unclear, though they were not issued through official ISIS outlets. https://t.co/obKJQvbroh pic.twitter.com/x15cztkCUK
— Rita Katz (@Rita_Katz) April 22, 2019