భారత్ సరిహద్దుల్లో ఐసిస్: బంగ్లాదేశ్లో పూజారి హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో ప్రధాన హిందూ పూజారిని తుపాకులు, కత్తులతో దుండగులు దారుణంగా హత్య చేశారు. భారత్ సరిహద్దుల్లోని పంచగఢ్ జిల్లా శాంతగౌరియో ఆలయ పరిసరాల్లో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.
ఇస్లామిక్వాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు దుండగులు ఆలయ పరిసరాల్లోకి బైక్ పైన వచ్చారు. అనంతరం దేవాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పూజారి జోగేశ్వర్ దశ దికారి బయటకు వచ్చారు. వెంటనే ఆ దుండగులు పూజారిపై దాడికి దిగారు. కత్తితో ఆయన గొంతు కోశారు.
కాగా, ఇరాక్, సిరియాల్లో దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూజారిని హతమార్చింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ హత్యకు తామే కారణమని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఐసిస్ ప్రకటించింది.
చనిపోయిన పూజారీ బంగ్లాదేశ్ పంజాగఢ్లోని దేవీ గంజ్ ఆలయంలో జోగేశ్వర్ (55) పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో గొంతు కోయడంతో ఆ పూజారి అక్కడికక్కడే చనిపోయారు. యోగేశ్వర్ను కాపాడేందుకు యత్నించిన ఓ భక్తుడిపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు అతడిని గాయపర్చి పరారయ్యారు.