లండన్పై తెగబడింది మేమేనన్న ఐసిస్: 85కి.మీ వేగంతో తొక్కించి.. దాడి జరిగిందిలా!
సరిగ్గా రాత్రి 10గం. సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఎస్ ఆకారంలో ఉన్న ఓ వ్యాను.. 85కి.మీ వేగంతో లండన్ బ్రిడ్జిపై ఉన్న పాదచారులను ఢీకొట్టింది.
లండన్: మాంచెస్టర్ ఉగ్రదాడిలో 22మంది ప్రాణాలు కోల్పోయిన భీతావహ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే.. లండన్ లో మరో ఉగ్రదాడి చోటు చేసుకోవడం ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తోంది. తాజా ఘటన కూడా ఐసిసే దుశ్చర్చే కావడం గమనార్హం.
లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు
ఈ మేరకు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ఐసిస్) ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ పోరాట యోధులు శనివారం రాత్రి లండన్ లో దాడికి పాల్పడ్డారని అమాఖ్ మీడియా పేజీలో ఐసిస్ వెల్లడించింది. ఇటీవలి కాంలలో బెర్లిన్, స్టాక్ హౌంలలో ట్రక్కు దాడి ద్వారా పదుల సంఖ్యలో ప్రజలను హతం చేసిన ఉగ్రవాదులు.. తాజా దాడిలోను అదే పంథాను అనుసరించారు.
లండన్ బ్రిడ్జి, బరో మార్కెట్ పై దాడి:
కిటకిటలాడుతున్న లండన్ బ్రిడ్జిపై అతివేగంతో వ్యాన్ నడిపిన ఉగ్రవాదులు.. పాదచారుల పైకి ఎక్కించేశారు. ఆపై సమీపంలోని ఓ పబ్ లోకి చొరబడి దొరికినవారిని దొరికనట్లు కత్తితో పొడిచారు. పబ్ దాడిలో 7మంది చనిపోగా.. బ్రిడ్జిపై వ్యాన్ దాడిలో ఇద్దరు హతమయ్యారు. పబ్ పై దాడి అనంతరం ఓ రెస్టారెంట్ లోను ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
85కి.మీ వేగంతో తొక్కించేశారు:
సహజంగానే నిత్యం రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జి.. వీకెండ్ కావడంతో మరింత రద్దీని సంతరించుకుంది. పక్కనే ఉన్న బరో మార్కెట్ కూడా సందర్శకులతో కిటకిటలాడుతోండగా.. సరిగ్గా రాత్రి 10గం. సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఎస్ ఆకారంలో ఉన్న ఓ వ్యాను.. 85కి.మీ వేగంతో లండన్ బ్రిడ్జిపై ఉన్న పాదచారులను ఢీకొట్టింది.
హై అలర్ట్:
లండన్ ఉగ్రదాడి నేపథ్యంలో.. మృతి చెందిన వారికి నివాళిగా బ్రిటన్ జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయడం గమనార్హం. ఈ దాడిలో భారతీయులెవరూ గాయపడలేదని భారత దౌత్య కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో లండన్ బ్రిడ్జి స్టేషన్ను మూసివేసిహైఅలర్ట్ ప్రకటించారు.
అనుమానితుల అరెస్టు:
దాడితో మరోసారి బ్రిటన్ ఉలిక్కిపడగా.. మరో నాలుగు రోజుల్లో బ్రిటన్లో సాధారణ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఈ ఉగ్రదాడి చోటుచేసుకోవడం గమనార్హం. దాడి నేపథ్యంలో సాధారణ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం అన్ని పార్టీలు నిలిపివేశాయి. ఘటనకు సంబంధించి తూర్పు లండన్ లోని బార్కింగ్ ప్రాంతంలో 12మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడికి పాల్పడినవారిలో ఓ వ్యక్తిని మధ్యధరా ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.