9/11కు మించిన దాడులు: అమెరికాకు ఐఎస్ఐఎస్
సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది.
2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా ఈ వీడియోలో పొందుపర్చారు.
అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు.
'అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం' అనే మార్చింగ్ సాంగ్తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు.