సగం కూలిన ఐఎస్ సామ్రాజ్యం
ఉగ్ర దాడులతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు 2016లో చేదు అనుభవాలే మిగిలాయి.
బాగ్దాద్: ఉగ్ర దాడులతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు 2016లో కోలుకోలేని దెబ్బలు తగిలాయి. లిబియా, ఇరాక్, సిరియా తదితర దేశాల్లో ఐఎస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై సంకీర్ణ, ప్రభుత్వ దళాలు దాడులు జరిపి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో ఐఎస్ సామ్రాజ్యం సగం కూలినట్టయింది.. ఈ దాడుల్లో దాదాపు 50 వేల మంది వరకు జిహాదీలు హతమవడం కూడా ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఇస్లామిక్ స్టేట్ .. తన ఉగ్రవాద చర్యలతో ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న సంస్థ. కానీ గడిచిన ఏడాది మాత్రం ఆ సంస్థకు చేదు అనుభవాలనే మిగిల్చింది. పలు దేశాలకు విస్తరించిన ఐఎస్ సామ్రాజ్యం.. 2016 చివరికి వచ్చేసరికి సగానికిపైగా కూలిపోయింది.
పలు దేశాలు కూటమిగా జరిపిన దాడులతో దాదాపు 50 వేల మంది జిహాదీలు మృతి చెందారు. ఇరాక, సిరియాలలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతుండడం, మరోవైపు సంకీర్ణ, ప్రభుత్వ దళాలు జరుపుతున్న భూతల, వైమానిక దాడులతో ఐఎస్ అతలాకుతలం అవుతోంది.
క్రమంగా పట్టు కోల్పోతూ...
ఒకప్పుడు ఇరాక్, సిరియాలో బలంగా పాతుకుపోయిన ఇస్లామిక్ స్టేట్ కు ఇటీవలి కాలంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వ్యూహాత్మక ప్రాంతాలైన ఇరాక్ లోని ఫల్లూ జా, రామది, అన్బర్.. సిరియాలోని మన్బిజ్... తాజాగా అలెప్పో వంటి ప్రాంతాల నుంచి ఐఎస్ ఉగ్రవాదులను సంకీర్ణ దళాలు తరిమి కొట్టాయి.
మరోవైపు లిబియాలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించినా డిసెంబర్ మొదట్లో సిర్ట్ పట్టణాన్ని కోల్పోవడంతో ఐఎస్ ఆశలకు గండి పడింది. 2014 జూన్ లో దాదాపు ;పదివేల మంది ఇరాకీ సైనికులు, అమెరికా సాయంతో ఐఎస్ నుంచి మొసూల్ విముక్తికి భీకర యుద్ధం ప్రారంభించారు.
ఇక్కడే ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇస్లామిక్ రాజ్య స్థాపన ప్రకటన కూడా చేశాడు. అయితే ఈ యుద్ధంలో ఉగ్రవాద సంస్థ భారీ సంఖ్యలో జిహాదీలను పోగొట్టుకోవడం గమనార్హం.
ఆ తర్వాత సిరియాలోని మరో ప్రధాన స్థావరమైన రక్కా కూడా ప్రభుత్వ బలగాల వశం కావడంతో ఇక ఇస్లామిక్ స్టేట్ అనే భావనకు అర్థం లేకుండా పోయిందని విశ్లేషకుల అభిప్రాయం. 2016లో ఐఎస్ పై జరిపిన దాడుల్లో అమెరికా, బ్రిటన్, రష్యా, పశ్చిమ దేశాలతోపాటు.. టర్కీ, ఇరాన్, ఇరాక్ సిరియా దళాలు ప్రధాన పాత్ర పోషించాయి.
సిరియాలోని అలెప్పో విముక్తే లక్ష్యంగా జరిపిన పోరాటంతో అక్కడి నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టారు. అమెరికా నివేదికల ప్రకారమం... 2014లో 7 దేశాలకే పరిమితమైన ఐఎస్ కార్యకలాపాలు.. 2015లో 13 దేశాలకు, 2016లో 18 దేశాలకు విస్తరించాయి.
ఈజిప్ట్, ఇండోనేషియా, మాలి, ఫిలిప్పీన్స్, సోమాలియా, బంగ్లాదేశ్ దేశాల్లోనూ ఇది వేళ్ళూనుకుంటోంది.
50,000 మంది జిహాదీలు హతం
2016లో ఐఎస్ ఉగ్రవాదులతో జరిగిన యుద్ధంలో 30 లక్షల మంది పౌరులతో పాటుగా 44 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఐఎస్ చెర నుంచి విడిపించినట్లు సంకీర్ణ దళాల కమాండర్ జనరల్ స్టీవ్ టౌన్ సెండ్ తెలిపారు.
మొసూల్ పై జరిగిన పోరాటంలో ఉగ్రవాదుల వ్యూహాలను బట్టి చూస్తే వాళ్ళు అంత తేలికగా లొంగే రకం కాదని అనిపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఎస్ కొంతవరకు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా, బలగాన్ని పెంచుకుని మెరుపుదాడులకు దిగే సూచనలు లేకపోలేదనేది విశ్లేషకుల భావన.