ట్రంప్ గెలిస్తే అమెరికా సర్వనాశనం: ఐఎస్ఐఎస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని మద్దతు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలవాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు కోరుకుంటున్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అంతం చూస్తానని, వారి మీద పోరాటం చెయ్యడానికి అదనంగా మరో 30 వేల యూఎస్ ట్రూప్ లు పంపుతానని, బాంబులు వేయిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికా నాశనం అవుతుందని, అతని దూకుడు నిర్ణయాలే ఆపని చేస్తాయని ఇస్లామిక్ స్టేట్ జీహాదీలు భావిస్తున్నారు. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ కు చెందిన మీడియాలో జీహాదీల ఇంటర్వూలు వచ్చాయి.
డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెడితే ఆయన నాయకత్వంలోనే అమెరికా స్వీయవినాశనం అవుతుందని జీహాదీలు విశ్వసిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ నిలకడలేని మనిషి అని, ఆయన ముస్లీంలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
అదే జరిగితే ముస్లీం సమాజం ఏకం అవుతుందని, అప్పుడు ఇస్లామిక్ టీం, యాంటీ ఇస్లామిక్ టీంల మధ్య యుద్ధం జరుగుతుందని జీహాదీలు అన్నారు. ట్రంప్ తమ శత్రువు అని, అయినా ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఇంటర్వూలలో జీహాదీలు చెప్పారు.