నరరూప రాక్షసుడిని మట్టుబెట్టిన అమెరికా బలగాలు: సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్: నాడు లాడెన్..
న్యూయార్క్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్.. కథ ముగిసినట్టే. ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఆ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. దీనికి సంకేతమా అన్నట్టు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పటికే.. ఓ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడే ఓ భారీ సంఘటన చోటు చేసుకుంది (సమ్ థింగ్ వెరీ బిగ్ హ్యాస్ జస్ట్ హ్యాపెన్డ్) అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐసిస్ సామ్రాజ్యంలో అడుగు పెట్టి..
ఇడ్లిబ్ ప్రావిన్స్. సిరియాలో ఐసిస్ సామ్రాజ్యం ఇది. గుట్టు చప్పుడు కాకుండా..ఇడ్లిబ్ లోకి ప్రవేశించిన అమెరికా ప్రత్యేక బలగాలు బాగ్దాదిని కాల్చి చంపినట్లు విదేశీ మీడియా సైతం వెల్లడించింది. ఏడాది కాలంగా ఇదే ప్రాంతంలో మూడో కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు బాగ్దాది. అమెరికా సైన్యం తన కోసం వేట కొనసాగిస్తోందనే విషయాన్ని తెలుసుకున్న తరువాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచే తన నెట్ వర్క్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. భారత్ సహా పలు దేశాల్లో చాప కింద నీరులా ఐసిస్ సానుభూతిపరులు విస్తరించారనడానికి చాలా సంఘటనలు వెలుగు చూశాయి.
లాడన్ తరహాలోనే..
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన తరహాలోనే అమెరికా సైనిక బలగాలు ఈ సీక్రెట్ ఆపరేషన్ ను సాగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో 2011లో లాడెన్ ను హతమార్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈ ఆపరేషన్ ను నిర్వహించింది అమెరికా. అత్యంత రహస్యంగా ఉంచింది. సిరియాలో ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ బలగాలు మకాం వేశాయి. ఐసిస్ పై విస్తృత దాడులు చేస్తూ.. దాన్ని ఇడ్లిబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితం చేశాయి. క్రమంగా అమెరికా బలగాలు సైతం వారితో కలిశాయి. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. రహస్యంగా దీన్ని ఈ ఆపరేషన్ ను నిర్వహించింది.
ఇడ్లిబ్ స్థావరంలోనే.. ఆపరేషన్..
ఇడ్లిబ్ లో బాగ్దాదికి చెందిన స్థావరంలోనే అతణ్ని హతమార్చినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. బాగ్దాదితో పాటు ఇంకా ఎంత మంది మరణించారనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని చెబుతున్నారు. బాగ్దాదితో పాటు అతని సహచరులు, ఐసిస్ కమాండర్ స్థాయి ఉగ్రవాదులు సైతం హతమైనట్లు విదేశీ మీడియా పేర్కొంది.
ఇరాక్ లో జన్మించి..
ఇరాక్ లో జన్మించిన బాగ్దాది.. ప్రారంభంలో మత పెద్దగా వ్యవహరించాడు. ఓ మౌల్వీగా మసీదులో కార్యకలాపాలను నిర్వహించాడు. క్రమంగా ఉగ్రవాద భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నాడు. లాడన్ హతమైన తరువాత అల్ ఖైదా నిర్వీర్యమైపోవడంతో ఆ స్థాయిలో ఐసిస్ ను విస్తరించేలా తన నెట్ వర్క్ ను రూపొందించుకున్నాడు. భారత్ సహా పలు దేశాల్లో ఐసిస్ జాడలు కనిపించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పాతబస్తీలోనూ డజను మందికి పైగా ఐసిస్ సానుభూతిపరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.