జుకర్బర్గ్, డోర్సేలను చంపేస్తాం: ఐఎస్(వీడియో)
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐఎస్).. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేలను చంపేస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు ఐఎస్ఐఎస్ ఓ వీడియోని కూడా విడుదల చేసింది.
ఆ వీడియోలో జుకర్బర్గ్, డోర్సేల ఫోటోలకు బులెట్ రంధ్రాలు చేసి ఉన్నాయి. సోషల్ మీడియా వెబ్సైట్లు అయిన ఫేస్బుక్, ట్విట్టర్లలో తమ ఉగ్రవాదుల సమాచారాన్ని బ్లాక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వీరు ఈవిధంగా చేస్తున్నట్లు చెప్పారు.
‘ఫ్లేమ్స్ ఆఫ్ సపోర్టర్స్' పేరిట విడుదల చేసిన ఈ వీడియో 25 నిమిషాలపాటు సాగింది. ఈ వీడియోలో ఇంగ్లీష్లో సబ్టైటిల్స్ కూడా వేశారు. అందులో జుకర్బర్గ్, డోర్సేలను చంపేస్తామంటూ పేర్కొన్నారు.
తమకు సంబంధించిన ఖాతాలను ఒక్కటి తొలగిస్తే.. తాము మరో 10 క్రియేట్ చేస్తామని చెప్పారు. అనంతరం మీ పేర్లను పూర్తిగా తొలగించేస్తామంటూ పేర్కొన్నారు. అంతేగాక, తాము ఇప్పటి వరకు 10,000 ఫేస్ బుక్ ఖాతాలు,150 ఫేస్ బుక్ గ్రూప్స్ను హ్యాక్ చేసినట్లు చెప్పింది.
5,000 ట్విట్టర్ ఖాతాలను కూడా దొంగిలించినట్లు వెల్లడించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తన చర్యలు ఆపేయకుంటే వాటిని తన మద్దతుదారులకు తాము హ్యాక్ చేసిన ఖాతాలను కేటాయిస్తామని బెదిరించింది.