నకిలీ పాస్ పోర్టులు ముద్రిస్తున్న ఐఎస్ఐఎస్
వాసింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్నదని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్నది. ఉగ్రవాదులు సిరియా ప్రభుత్వం పేరుతోనే ఈ నకిలి పాస్ పోర్టులు తయారు చేస్తున్నారని ఎఫ్ బీఐ తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పూర్తి వివరాలను ఎఫ్ బీఐ సేకరిస్తున్నది. ఇప్పటికే సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సొంతంగా పాస్ పోర్టులు తయారు చేసి సిరియా ప్రభుత్వ సీల్ లు వేస్తున్నదని గుర్తించింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటికే సిరియాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న భవనాలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించడానికి వీలుగా యువతకు నకిలీ పాస్ పోర్టులు తయారు చేసి ఇస్తున్నారని వెలుగు చూసింది.
అంతే కాకుండ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ పాస్ పోర్టులు తయారు చేశారని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు తెలిపారు.
సిరియాలో నివాసం ఉంటున్న పౌరుల పూర్తి వివరాలు సేకరించి, వారి పేర్లతో నకిలి పాస్ పోర్టులు తయారు చేస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే పాస్ పోర్టుల తయారీ యంత్రాలు, పాస్ పోర్టు బ్లాంక్ పుస్తకాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సేకరించారని యూఎస్ తన నివేదికలో తెలిపింది.
నకిలి పాస్ పోర్టులు గుర్తించడానికి అమెరికా సిద్దం అయ్యింది. ప్రత్యేక చిఫ్ తో నకిలీ సమాచారానికి తావు లేకుండా బయోమెట్రిక్ విధానం ద్వార సమాచారాన్ని భద్రపరచాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.