శ్రీలంకలో పేలుళ్లు: ఆత్మాహుతి సభ్యులు ప్రమాణం చేస్తున్న వీడియో విడుదల
కొలంబో: శ్రీలంకలో నరమేధానికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యులు తమకు అప్పగించిన పనిని పూర్తి చేస్తామంటూ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదికి ప్రమాణం చేస్తున్న వీడియోను ఐసిస్ అధికారిక మాధ్యమం విడుదల చేసింది. ఇందులో ఏడు మంది ఉగ్రవాదులతో పాటు ఈ దాడులకు సూత్రధారిగా ఉన్న జహ్రాన్ హషీం కూడా ఉన్నాడు. వీరంతా ముసుగు ధరించగా అందులో జహ్రాన్ మాత్రం ముసుగు ధరించలేదు. అంటే జహ్రాన్ ఈ దాడులకు స్కెచ్ మాత్రమే వేశాడు కానీ శ్రీలంకకు వచ్చి ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. ముసుగు ధరించి వారు మాత్రమే శ్రీలంకలో దాడులు చేసినట్లు అర్థమవుతోంది.
శ్రీలంకలో ఉగ్రదాడులకు దాదాపు 351 మంది మృతి చెందారు. ఈ దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారిగా జరిగినట్లు తెలుస్తోంది. ఈస్టర్ సమయంలో క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఉగ్రవాది లోపలికి చొరబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చర్చిలోకి చొరబడిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో పక్కనే ఉన్న చాలా మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు పలు స్టార్ హోటళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన ఉగ్రవాదులు అక్కడ కూడా చాలామంది మృతి చెందారు.
#BREAKING : #NTJ alliance with #ISIS on #SriLanka's #Easter bombs attack. pic.twitter.com/ygHB8w5ogx
— Albert Batlayeri🌐 (@AlbertBatlayeri) April 23, 2019
బాంబు దాడుల తర్వాత జరిగిన తనిఖీల్లో విమానాశ్రయం సమీపంలో ఒక బాంబును పోలీసులు కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. వ్యానులో ఉంచిన మరో బాంబు పేలగా అక్కడ ప్రాణనష్టం జరగలేదు. బుధవారం ఓ బైకులో బాంబును గుర్తించిన పోలీసులు దాన్ని దూరంగా తీసుకెళ్లి పేల్చేశారు. మొత్తానికి ఉగ్రభయం నుంచి శ్రీలంక ఇంకా తేరుకోలేదు. అసలు వీరెంతమంది వచ్చారు ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారు అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతున్నారు. ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 100మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.