19 మంది హిందువులను సిక్కులను చంపింది మేమే: ఐసిస్
తూర్పు ఆఫ్ఘానిస్తాన్లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడికి బాధ్యులం తామేనంటూ ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్. అఫ్ఘానిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ గనితో జలాలాబాద్లో సమావేశం అయ్యేందుకు ప్రయాణిస్తున్న మైనార్టీ వర్గాలకు చెందిన బృందంపై ఐసిస్ విరుచుకుపడింది. దీంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కులు హిందువులు ఉన్నారు. అవతార్ సింగ్ ఖాల్సా అనే సిక్కు మతానికి చెందిన నాయకుడు ఈ దాడిలో మృతిచెందారు.
ఈ దాడికి పాల్పడింది తామే నంటూ ఐసిస్ ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో ముస్లింయేతర వ్యక్తులను టార్గెట్ చేశామంటూ ప్రకటనలో తెలిపారు. ముస్లిం దేశమైన అఫ్ఠానిస్తాన్లో సిక్కులు, హిందువులు తక్కువ శాతంలో నివసిస్తున్నారు. అయితే అక్కడ వారు పలు రకాలుగా అవమానాలకు గురవుతున్నారు. దీంతో ఐసిస్ వారిని టార్గెట్ చేయగా ఇప్పటికే చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1970లో మైనార్టీలుగా ఉన్న సిక్కులు హిందువుల జనాభా ఆ దేశంలో 80 వేలు ఉండగా... నేటికి ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఐసిస్ దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.