ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు లఖ్వీ విడుదలకు గ్రీన్ సిగ్నల్
ఇస్లామాబాద్: 26/11 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు జకీ -ఉర్ - రెహ్మాన్ లఖ్వీ విడుదలకు ఇస్లామాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలలపాటు లఖ్వీని నిర్భంధంలో ఉంచాలని పాక్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది.ఉగ్రవాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడంపై సర్వత్రా వ్యతిరేకతలు వ్యక్తమవడంతో పాక్ ప్రభుత్వం లఖ్వీని మూడు నెలల పాటు జైలులోనే ఉంచాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ప్రభుత్వ ఉత్తర్వులపై లఖ్వీ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం లఖ్వీకి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో రావల్పిండి జైళ్లో ఉన్న లఖ్వీ విడుదలకు మార్గం సుగమమైంది. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి లఖ్వీ అని భారత్ ఆరోపిస్తోంది.
విడుదలకు ఆదేశాలు జారీ అయినప్పటికీ న్యాయమూర్తి ఆదేశాలపై సంతకం చేసే వరకు అతను విడుదల కాడు. లఖ్వీ విడుదలకు కోర్టు పచ్చజెండా ఊపిన వెంటనే భారత్ తీవ్రంగా స్పందించింది. లఖ్వీ విడుదలకు పచ్చజెండా ఊపడం సాంకేతికపరమైన తప్పిదం మాత్రమేనని, బెయిల్ను హైకోర్టులో సవాల్ చేస్తామని పాకిస్తాన్ తెలిపింది.
పాకిస్తాన్ ప్రభుత్వానికి బెయిల్ ప్రతి అందడానికి వారానికి పైగా పడుతుంది. అది అందిన తర్వాతనే దాన్ని సవాల్ చేయడానికి వీలవుతుంది. సుప్రీంకోర్టు రెండు వారాల సెలవులు ముగిసిన తర్వాతనే లఖ్వీ బెయిల్ను సవాల్ చేయడానికి వీలవుతుందని ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధురి అజార్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ నిర్బంధం స్వభావం కలిగింది కాబట్టి అటువంటి కేసులను సెలవు రోజుల్లో కూడా చేపడుతారని ఇస్లామాబాద్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తి కౌసర్ అబ్బాస్ జైదీ అన్నారు.
పాకిస్తాన్ రాయబారికి భారత్ సమన్లు
పాకిస్తాన్ రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. లఖ్వీకి బెయిల్ అంశం పైన భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.