ఉగ్రవాదుల మారణహోమం... ఆ 2 గ్రామాల్లో 100 మందిని కాల్చి చంపారు...
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో ఇస్లామిక్ తీవ్ర వాదులు రెచ్చిపోయారు. మాలి సరిహద్దులోని రెండు గ్రామాలపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు 100 మంది గ్రామస్తులను పొట్టనబెట్టుకున్నారు. అంతకుముందు ఇద్దరు బొకోహారమ్ ఉగ్రవాదులను స్థానికులు కొట్టి చంపడంతో దానికి ప్రతీకారంగా ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నైగర్ ప్రధాని బ్రిగి రఫినీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాల్పులు చోటు చేసుకున్న టోంబాంగౌ, జారౌమ్దరే గ్రామాలను ప్రధాని స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కాల్పుల ఘటన జరిగిన రోజే అధ్యక్ష ఎన్నిక కోసం మరో విడత ఎన్నికలు జరపనున్నట్లు అక్కడి ఎన్నికల కమిషన్ ప్రకటించడం గమనార్హం.
అధ్యక్ష ఎన్నిక కోసం ఇప్పటికే ఓటింగ్కి జరగ్గా... 28 మంది అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ దక్కలేదు. దీంతో మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. మొత్తం 7.4మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
కాగా,నైగర్లో చాలాకాలంగా ఇస్లామిక్ తీవ్రవాదులు నెత్తుటేరులు పారిస్తూనే ఉన్నారు. బొకొహారం,ఆల్ఖైదా సంబంధిత ఉగ్రవాద సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది నైగర్ ప్రజలు ఈ మారణహోమంలో బలైపోయారు.దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్నేళ్లుగా ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బలవంతంగా ఎంతోమందిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. గత నెలలో దిఫా ప్రాంతంపై దాడి చేసిన ఉగ్రవాదులు దాదాపు 27 మందిని కాల్చి చంపారు. నైగర్లో చోటు చేసుకుంటున్న ఈ మారణహోమంపై ఐరాస కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.