అమెరికా దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్కి తీవ్రగాయాలు: ఆధారాల్లేవన్న పెంటగాన్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్ధ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో గాయపడ్డాడని గార్డియన్ పత్రికలో వార్తా కథనం వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఐసీస్ అధినేత బకర్ అల్ బాగ్దాదీ గాయపడ్డాడని చెప్పడానికి తమవద్ద ఎలాంటి ఆధారాల్లేవని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీనిపై పెంటగాన్ ప్రతినిధి కల్నల్ స్టీవెన్ వారెన్ స్పందిస్తూ గాయపడిన వ్యక్తి బాగ్దాదీయేనని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.
‘గార్డియన్' పత్రిక కథనం ప్రకారం.. పశ్చిమ ఇరాక్లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో ఐస్ఐఎస్ అధినేత తీవ్రంగా గాయపడ్డాడని ది గార్డియన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మోసుల్ పట్టణానికి 200 కి.మీ. దూరంలో అల్ బాజ్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది.
ఉమ్ అల్ రౌస్, అల్ ఖరాన్ అనే గ్రామాల మధ్య మూడు వాహనాల కాన్వాయ్పై మార్చి 18న సంకీర్ణ సేనలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో వాహనాల్లోని ఉగ్రవాదులందరూ దుర్మరణం చెందగా, ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే అమెరికా సంకీర్ణ సేనలకు ఆ కాన్వాయ్లో అల్ బాగ్దాది ఉన్న విషయం తెలియదని ది గార్డియన్ పేర్కొంది. అయితే అతను కోలుకుంటున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే బకర్ అల్ బాగ్దాదీ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డుని అమెరికా ప్రకటించింది.