ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్య: జోర్డాన్ పైలట్ సజీవ దహనం
అమన్: ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. రెండు రోజుల క్రితం జపాన్కు చెందిన రెండో పాత్రికేయుడి తల నరికి చంపిన ఉగ్రవాదులు.. జోర్డాన్కు చెందిన ఓ పైలట్ను సజీవంగా దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీడియో దృశ్యాలను విడుదల చేశారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సిరియాలో చేపట్టిన సంకీర్ణ చర్యల్లో పాల్గొన్న జోర్డాన్కు చెందిన ఎఫ్-16 జెట్ విమానం డిసెంబర్ 24న కుప్పకూలింది. ఆ విమాన పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిర్బంధించారు.
జోర్డాన్లో ఉన్న ఇరాకీ మహిళా ఆత్మాహుతి బాంబర్ సాజిదా అల్ రిషావిని తమకు అప్పగించకుంటే పైలట్ను చంపేస్తామని ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. విడుదల చేయని కారణంగా జోర్డాన్ పైలట్ను సజీవ దహనం చేశారు.
జోర్డాన్ పైలట్ను ఓ ఇనుప భోనులో ఉంచి పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో అతడు సజీవ హనమయ్యాడు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను ఉగ్రవాదులు మంగళవారం విడుదల చేశారు. ఈ దారుణ ఘటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తోపాటు ప్రపంచ దేశాలు ఖండించాయి.
కాగా, ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యపై జోర్డాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అదుపులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరితీసింది.