ఐఎస్ ఘాతుకం: ఉపవాసం ఉండలేదని ఉరితీశారు
బీరూట్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన అరాచకాలను కొనసాగిస్తోంది. రంజాన్ వేళ్లల్లో ఉపవాసం ఉండలేదని ఆగ్రహించిన.. ఉగ్రవాదులు ఓ ఇద్దరు యువకులను ఉరితీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ దారుణ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్ లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని తెలిపారు. రంజాన్ నియమనిబంధనలకు విరుద్ధంగా ఆహారం తీసుకున్నారనే నెపంతో ఇద్దరు యువకులను ఉగ్రవాదులు ఉరితీశారని చెప్పారు.
ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే.
అయితే ఆ ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ముస్లింలను హెచ్చరించింది.