జడ్జిని కిడ్నాప్ చేసి చంపేసిన ఐఎస్ఐఎస్
లిబియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు సైనికులు, పోలీసులు, స్థానిక ప్రజలను చిత్రహింసలకు గురి చేసి దారుణంగా చంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక కోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేశారు.
మహమ్మద్-ఉల్-నమ్లి ఆనే జడ్జి హత్యకు గురైనారు. లిబియాలోని అల్ కోమ్స్ అప్పీల్ కోర్టులో మహమ్మద్-ఉల్- నమ్లీ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఇటివల ఆయన సిర్టి అనే నగరంలో ఉన్న విషయం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు గుర్తించారు.
తరువాత సాయుధ బలగాల (సైనికుల) దుస్తులలో వెళ్లిన ఉగ్రవాదులు న్యాయమూర్తిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అనేక విధాలుగా న్యాయమూర్తిని విడిపించడానికి ప్రయత్నాలు చేసింది.
అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు న్యాయమూర్తి మహమ్మద్ ను చిత్రహింసలకు గురి చేసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి హరావా అనే పట్టణంలో విసిరివేసి వెళ్లారు.
విషయం గుర్తించిన ప్రభుత్వం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి మహమ్మద్ హత్యకు గురైనారని లిబియన్ జ్యుడిషియల్ అర్గనైజేషన్ ధ్రువీకరించింది. ఉగ్రవాదులు చివరికి న్యాయమూర్తులను వదలకపోవడంతో జడ్జిలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.