సముద్ర గర్భంలో గుర్తు తెలియని చోట..బాగ్దాదీ మృతదేహం: ఇస్లామిక్ సంప్రదాయంలో ఖననం: నాడు లాడెన్..!
వాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీ మృతదేహం ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న తరువాత బాగ్దాది మృతదేహాన్ని అమెరికా సైనిక బలగాలు ఏం చేెసి ఉంటాయి? లాడెన్ తరహాలోనే అతని మృతదేహాన్ని కూడా సముద్రంలో ఖననం చేసి ఉంటారా? లేక వెంట తీసుకెళ్లి ఉంటాయా? అనే అనుమానాలకు తెర పడింది. బాగ్దాది మృతదేహాన్ని కూడా సముద్రంలోనే ఖననం చేశాయి అమెరికా సైనిక బలగాలు. బాగ్దాదీ మృతదేహాన్ని ఏ సముద్రంలో ఖననం చేశారు? ఏ ప్రాంతంలో అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టారనే విషయాలను రహస్యంగా ఉంచింది.
ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!
Recommended Video
తనను తాను పేల్చేసుకున్న బాగ్దాది
సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ బారిషాలో గల తన స్థావరంలో బాగ్దాది ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాగ్దాది గుట్టుమట్లు, ఆనుపానులను తెలుసుకున్న తరువాత అమెరికా సైనిక బలగాలు ఈ నెల 27వ తేదీన అతని స్థావరాన్ని చుట్టుముట్టాయి. వారి చేతిలో తన చావు తప్పదని గ్రహించిన బాగ్దాది ఇక తప్పించుకునే మార్గమేదీ కనిపించకపోవడంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శక్తిమంతమైన బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు తీవ్రతకు అతని స్థావరం కూడా కుప్పకూలిపోయింది. నేలమట్టమైంది. ఈ ఘటనలో కొందరు అమెరికా సైనికులు కూడా గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం.. ఖననం
డీఎన్ఏ పరీక్షల అనంతరం బాగ్దాది మృతదేహాన్ని నిర్ధారించారు సైనికులు. ఈ విషయాన్ని పెంటగాన్ లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. 15 నిమిషాల్లో డీఎన్ఏను పూర్తి చేశామని, తమకు లభించిన మృతదేహం బాగ్దాదిదేనని ధృవీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే దాన్ని ఖననం చేసేశారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అతని మృతదేహాన్ని సముద్ర గర్భంలో ఖననం చేశామని అమెరికా సంయుక్త బలగాల ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ ప్రకటించారు. ఇదివరకు లాడెన్ మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుసరించిన పద్ధతులనే తాము పాటించామని అన్నారు.
ఐసిస్ ఉగ్రవాదుల పుణ్యక్షేత్రంలా..
ఏ సముద్ర గర్భంలో బాగ్దాది మృతదేహాన్ని ఖననం చేశారనే విషయాన్ని వెల్లడించడానికి మార్క్ మిల్లీ ఇష్ట పడలేదు. దీన్ని తాము రహస్యంగా ఉంచామని అన్నారు. భూగోళం మీద ఎక్కడ బాగ్దాది మృతదేహాన్ని పూడ్చి పెట్టినా క్రమంగా ఆ ప్రదేశం ఐసిస్ ఉగ్రవాదుల పుణ్యక్షేత్రం (ష్రైన్ ఆఫ్ ఐసిస్)లా మారుతుందని, ఇస్లామిక్ ఉగ్రవాదం వ్యాపించడానికి కేంద్రబిందువు అవుతుందని చెప్పారు. దీన్ని నిరోధించడానికే తాము సముద్ర గర్భంలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం.. బాగ్దాది మృతదేహాన్ని ఖననం చేశామని స్పష్టం చేశారు. ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుసరించిన విధానాలే పాటించామని, దీనిపై తాను ఇంతకంటే ఎక్కువ వివరాలను వెల్లడించలేమని అన్నారు.
సజీవంగా ఇద్దరు ముఖ్య అనుచరులు..
అల్ బాగ్దాదికి చెందిన ఇద్దరు ముఖ్య అనుచరులను తాము సజీవంగా పట్టుకున్నట్లు మార్క్ మిల్లీ వెల్లడించారు. ప్రస్తుతం వారు తమ అదుపులో ఉన్నారని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్స్ మూలాల గురించి, వారికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదం ఏఏ దేశాల్లో పాకిందనే విషయాన్ని, వారి నెట్ వర్క్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టుకున్న తరువాత.. ఇస్లామిక్ స్టేట్స్ నెట్ వర్క్ ను ఎలా నిర్వీర్యం చేయాలనే విషయంపై వ్యూహాలను రూపొందిస్తామని మార్క్ మిల్లీ స్పష్టం చేశారు.
ఇడ్లిబ్ ప్రావిన్స్.. సిరియా అడుగు
క్రమంగా ఇడ్లిబ్ ప్రావిన్స్ ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా, రష్యా, బ్రిటన్, టర్కీ బలగాలు అడుగులు వేస్తున్నాయి. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన తరహాలోనే అమెరికా సైనిక బలగాలు ఈ సీక్రెట్ ఆపరేషన్ ను సాగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో 2011లో లాడెన్ ను హతమార్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈ ఆపరేషన్ ను నిర్వహించింది అమెరికా. అత్యంత రహస్యంగా ఉంచింది. సిరియాలో ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ బలగాలు మకాం వేశాయి. ఐసిస్ పై విస్తృత దాడులు చేస్తూ.. దాన్ని ఇడ్లిబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితం చేశాయి. క్రమంగా అమెరికా బలగాలు సైతం వారితో కలిశాయి.