ఐసిస్ ఉగ్రవాదుల మిషన్ 2020లో ఇండియా కూడా
లండన్: అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు ఓ ఐదేళ్లో, పదేళ్లో కాలపరిమితి పెట్టుకుని 'మిషన్ 2020', 'మిషన్ 2025' అని పేర్లు పెట్టుకుని ప్రభుత్వాలు ముందుకెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులూ మరింత ఆందోళనకు గురిచేసే ఓ మిషన్ నిర్దేశించుకున్నారు.
సాధ్యమైనన్ని ఎక్కువ దేశాల్లో ఇస్లామిక్ రాజ్యం సృష్టించాలని 'మిషన్ 2020'ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా 'ఉగ్ర' గొడుగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న జాబితా దేశాలతో కూడిన మ్యాప్ను విడుదల చేశారు.
వచ్చే ఐదేళ్లలో భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు సహా మధ్య ప్రాచ్య దేశాలు, ఉత్తరాఫ్రికా, యూరప్లోని పలు ప్రాంతాలను తమ రాజ్యంగా చేసుకోవాలని ఐఎస్ఐఎస్ భావిస్తోంది.
ఈ దేశాల్లో షరియా చట్టాలు అమలు చేయాలని, పడమర స్పెయిన్ నుంచి, తూర్పు చైనా వరకూ విస్తరించాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది. కాగా, ఐఎస్ఐఎస్ విడుదల చేసిన ఈ మ్యాప్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.