బాంబు పెట్టబోయి దానికే బలయ్యాడు: పాక్ ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి
పెషావర్: తాను పెట్టబోయిన బాంబు తన వద్దే పేలడంతో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్ మృతి చెందాడు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా కథనాలు వెలువరించింది.
తిరాహ్ లోయలోని తూర్ దారా ప్రాంతంలో రోడ్డు పక్కన అతడు బాంబును పాతి పెడుతుండగా పేలింది. ఘటనలో అతనితో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు మరణించినవారిలో ఒకరు పాకిస్థాన్ ఐఎస్ చీఫ్ అని తెలిపాయి. కాగా, ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ మాత్రం దీనిపై స్పందించలేదు.
ఔరఖ్జాయి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సయీద్ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్(టిటిపి)లో అగ్రనాయకుల్లో ఒకడిగా కొనసాగారు. తర్వాత ఆ సంస్థపై నిషేధం విధించడంతో టిటిపిని ఐఎస్ఐఎస్లో విలీనం చేస్తున్నట్లు మాజీ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పాకిస్థాన్ ఐఎస్కు సయీద్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు.
18 ఐఎస్ ఉగ్రవాదుల హతం
కైరో: ఈజిప్టులోని నార్త్ సినాయ్ ప్రావిన్స్లో జరిగిన సైనికదాడుల్లో 18మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలో తీవ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు సైనిక బలగాలు వైమానిక దాడులను జరిపాయి. ఈ దాడుల్లో 18మంది తీవ్రవాదులు హతమయ్యారు.
సినాయ్ తీవ్రవాద సంస్థకు చెందిన మరో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తీవ్రవాదుల దాడుల్లో సినాయ్లో ఇప్పటివరకు 500మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.