చిచ్చు పెట్టిన బెలూన్లు: ప్రధాని మారినా..బాంబులు పేలడం మాత్రం ఆగట్లే
జెరూసలెం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు దేశాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. సుమారు నెల రోజుల విరామం తరువాత- మరోసారి ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు సాగించింది. క్షిపణులను సంధించింది. ఈ ఘటనలో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణనష్టం సంభవించినట్లు ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా దాడులను విరమిస్తూ ఒప్పందాలు చేసుకున్న తరువాత చోటు చేసుకున్న తొలి పరిణామం ఇది.
Recommended Video
ఇటీవల ఇజ్రాయెల్లో అధికార మార్పిడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంజమిన్ నెతన్యాహు స్థానంలో నఫ్తాలి బెన్నెట్.. ఆ దేశ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. బాద్యతలను స్వీకరించారు. అధికార మార్పిడి అనంతరం చోటు చేసుకున్న తొలి దాడిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం సరిహద్దుల్లో- గాజా భూభాగంపై నుంచి గాల్లోకి వదలిన కొన్ని బెలూన్లు ఈ తాజా దాడులకు కారణమయ్యాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి.
ఆ బెలూన్ల వల్ల ఇజ్రాయెల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదాలకు కారణమయ్య బెలూన్లు వాటిని గుర్తించామని ఇజ్రాయెల్ భద్రతాధికారులు వెల్లడించారు. వాటి వల్ల తమ దేశ దక్షిణ ప్రాంతంలో 20 చోట్ల భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయని పేర్కొన్నారు. దీన్ని ఉద్దేశపూరక చర్యగా భావిస్తున్నామని తెలిపారు. అందుకే- గాజాపై మరోసారి క్షిపణులతో దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ తాజా దాడులపై నఫ్తాలి బెన్నెట్ స్పందించారు.
Gaza tonight pic.twitter.com/2iwp09R1js
— Muhammad Smiry (@MuhammadSmiry) June 15, 2021
ఎలాంటి కవ్వింపు చర్యలనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ప్రతీకార దాడులు ఉంటాయని హెచ్చరించారు. దీనికి ప్రతీకారంగా గాజాలోని హమాస్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్పై రాకెట్లను ప్రయోగించింది. కిందటి నెలలో సుమారుగా 11 రోజుల పాటు ఈ రెండు దేశాల మధ్య రాకెట్ల దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అదే నెల 21వ తేదీన కాల్పులు విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తరువాత తొలి ఎయిర్ స్ట్రైక్స్ ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.