అల్ఖైదాకు భారీ ఎదురుదెబ్బ- ఇజ్రాయెల్ దాడుల్లో నంబర్ టూ అబ్దుల్లా మృతి-
1998లో ఆఫ్రికాలోని అమెరికా ఎంబసీలో జరిగిన తీవ్రవాద దాడిలో సూత్రధారిగా ఉన్న ఉగ్రవాద సంస్ధ అల్ఖైదాలో నంబర్ టూగా ఉన్న అబ్దుల్లా అహ్మద్ అబ్లుల్లాను ఇజ్రాయెల్ దళాలు తాజాగా హతమార్చాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది ఆగస్టులో ఇరాన్ గడ్డపై అబ్దుల్లాను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టినట్లు నిఘా అధికారులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.
ఆగస్టు 7న ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మోటారు సైకిళ్లపై వచ్చిన ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు అబ్దుల్లాను అత్యంత సమీపం నుంచి కాల్చిచంపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అబ్దుల్లాకు అబూ మొహమ్మద్ అల్-మస్రీగా కూడా పేరుంది. అల్ఖైదా ప్రస్తుత బాస్ అయ్మన్ అల్ జవహరీ వారసుడిగా మస్రీని చెబుతుంటారు. ఈజిప్టులో జన్మించిన మస్రీ హత్యలో అమెరికా హస్తం ఉందా లేదా అన్నది తెలియరాలేదు. మస్రీ హత్యపై అల్ఖైదా నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. మరోవైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఇలా ఏ దేశం కూడా మస్రీ హత్యపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.
ఆగస్టు 7న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అబూ మస్రీతో పాటు ఆయన భార్య, అల్ఖైదా మాజీ ఛీఫ్ ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. 2003 నుంచి ఇరాన్ కస్టడీలో ఉన్న అబూ మస్రీ 2015 నుంచి మాత్రం స్వేచ్ఛగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్కు బద్ధ శత్రువు కావడం, ఆ దేశంలో ఉంటే క్షేమంగా ఉండొచ్చని భావించడం వల్లే అబూ మస్రీ అక్కడ ఉన్నాడని తెలుస్తోంది.