8,300 డాలర్లు ఇస్తామని భారత్ నుంచి తీసుకెళ్లి 800 డాలర్లు: ఎన్నారై కంపెనీకి అమెరికా జరిమానా
వాషింగ్టన్: కాలిఫోర్నియాలోని భారతీయ సంతతికి చెందిన ఓ సాఫ్టువేర్ కంపెనీకి అమెరికా 173,044 డాలర్ల జరిమానాను విధించింది. హెచ్1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో ఆ ఐటీ కంపెనీకి అమెరికా ప్రభుత్వం బుధవారం జరిమానా వేసింది.
ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారి చేసింది. నిబంధనల మేరకు పన్నెండు మంది విదేశీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదన్న కారణంతో జరిమానా విధించింది. ఈ ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
చెప్పిన దానికంటే తక్కువ జీతం
యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్స్ వేజ్ అండ్ హవర్స్ డివిజన్ విచారణలో విషయం వెల్లడైంది. వేతనాలు నిబంధనల మేరకు చెల్లించడం లేదని గుర్తించింది. క్లౌడ్విక్ టెక్నాలజీస్ ఐఎన్సీ సంస్థ భారత్ నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి వారికి చెప్పిన దానికంటే తక్కువ జీతం ఇస్తున్నారని విచారణలో వెల్లడైంది.
8300 డాలర్లు ఇస్తామని 800 డాలర్లు
వారికి నెలకు 8,300 డాలర్లు ఇస్తామని చెప్పి కేవలం 800 డాలర్లు చెల్లిస్తున్నారని గుర్తించింది. ఐటీ కంపెనీలకు సిలికాన్ వ్యాలీ పెట్టింది పేరు. ఈ కంపెనీ కూడా అక్కడే ఉంది. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం క్లౌడ్ విక్ టెక్నాలజీస్ సీఈవో అండ్ ఫౌండర్ మణి చబ్రా ఉందని చెబుతున్నారు.
ఈ సేవలు అందిస్తామంటూ
బిగ్ డేటా, క్లౌడ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, బిజినెస్ ఇంటలిజెన్స్ మోడరైజేషన్, డేటా సైన్స్, బిగ్ డేటా పైలట్ టు ప్రొడక్షన్, ఐవోటీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ తదితర సేవలను అందిస్తామని వెబ్సైట్లో పేర్కొంది. వెబ్ సైట్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ అమెరికా, కామ్కాస్ట్, హోమ్ డిపోట్, జేపీ మోర్గాన్, నెట్ యాప్, టార్గెట్, వీసా, వాల్మార్ట్ తదితర సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి.
ఉద్యోగాల కొరత ఉంటే
అమెరికన్ ఉద్యోగుల కొరత ఉన్నప్పుడు కంపెనీలు తగిన జీతంతో ఇతర దేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులకు హెచ్ 1బి వీసాల ద్వారా ఉద్యోగాలిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటా 85వేల హెచ్ 1బి వీసాలను జారీ చేస్తోంది.