సోలేమని హత్యకాండపై ట్రంప్ కీలక ప్రకటన: ఈ పాటికి అమెరికా చాలా నష్టపోయి ఉండేదంటూ..!
న్యూయార్క్: ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సొలేమని హత్యాకాండ, తదనంతరం ఇరాన్లో నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఇమామ్ ఖొమేనీ అంతార్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దళం నిర్వహించిన దాడుల్లో ఖాసిం సోలేమని దుర్మరణం పాలు కావడాన్ని ఇరాన్ తప్పు పట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని నివారించడానికే తాము ఖాసింపై దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వరల్డ్ నంబర్ వన్ టెర్రరిస్ట్..
ఖాసిం సోలేమనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అభివర్ణించారు. వరల్డ్ నంబర్ వన్ టెర్రరిస్ట్.. అని చెప్పుకొచ్చారు. ఖాసిం దుర్మరణం పాలు కాకపోయి ఉంటే.. ఈ పాటికి అమెరికా తీవ్రంగా నష్టపోయి ఉండేదని వ్యాఖ్యానించారు. అమెరికా సహా కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి ఉండేవాడని అన్నారు. ఈ పరిస్థితులు, అతని వ్యూహాలు, కుట్రల గురించి ముందే పక్కా సమాచారం అందడంతో ఖాసింపై దాడులను చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.
డెమొక్రాట్లకు చురకలు..
ఖాసిం సోలేమని హత్య చేయడానికి డెమొక్రాట్లు తప్పు పట్టడం పట్ల ట్రంప్..తనదైన శైలిలో స్పందించారు. ఖాసిం హత్యకు పూనుకోవడానికి బదులుగా ఆయనను బంధించి ఉంటే బాగుండేదని చెప్పడాన్ని తప్పు పట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిని బంధించడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో విపరీత పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అమెరికన్లకు అండగా..
ఖాసింపై దాడి చేయాలనే నిర్ణయాన్ని తాను అమెరికా కోసమే తీసుకున్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు. తమ దేశస్తులు, తమ దేశ ఆస్తులపై దాడులు చేస్తారనే విషయం ముందే తెలిసి కూడా ఎలా చూస్తూ ఊరుకోగలమని అన్నారు. ఇరాన్తో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని, ఇంతకుముందులా దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొంత సమయం పట్టొచ్చని చెప్పారు.