మారణాయుధాలు చేరవేయడం కష్టంగా మారింది: కశ్మీర్ ఉగ్రవాదులతో మసూద్ సోదరుడు
"అవసరమైన మారణాయుధాలు, పేలుడు సామగ్రి భారత్కు తరలించాలంటే చాలా కష్టంగా ఉంది. " ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే-మొహ్మద్ చీఫ్ మసూద్ అజర్ చిన్న తమ్ముడు ముఫ్తీ రౌఫ్ అస్గర్. జైషే మొహ్మద్ ఆపరేషనల్ కమాండర్గా వ్యవహరిస్తున్న అస్గర్ కశ్మీర్లోని జైషే ఉగ్రవాదులతో ఈ మాటలు చెప్పాడు. జమ్మూలోని నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో విధ్వంసానికి జైషే మొహ్మద్ తెరదీసింది. అయితే ఆయుధాలు పంపడం చాలా కష్టంగా ఉందని అస్గర్ కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులతో చెప్పారు.
ప్రస్తుతం మసూద్ అజర్ వెన్నునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. దీంతో ఉగ్రవాద సంస్థ బాధ్యతలను సోదరుడు అస్గర్ నిర్వర్తిస్తున్నాడు. ఇతని నేతృత్వంలోనే నాలుగు సార్లు పాక్ ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఇక నవంబర్ 19న జరిగిన ఎన్కౌంటర్ జైషే మొహ్మద్ సంస్థకు భారీ నష్టాన్ని చేకూర్చింది. భారత్లోకి చొరబడేందుకు అస్గర్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడు. ఈ శిక్షణ కోసం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. భారత్లోకి చొరబడేందుకు సరిహద్దులో ఉగ్రవాదులు భారీ సొరంగాన్ని తవ్వారు. ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు బీఎస్ఎఫ్ పేర్కొంది. 200 మీటర్ల మేరా ఉన్న ఈ సొరంగాన్ని చూసి ఒక్కింత ఆశ్చర్యానికి గురైంది బీఎస్ఎఫ్.
హతమైన ఉగ్రవాదుల దగ్గర నుంచి 11 ఏకే 47 రైఫిళ్లు, 3 పిస్తోళ్లు, 29 హ్యాండ్ గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్ ద్వారా విసిరే 6 గ్రెనేడ్లను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులను భారీ స్థాయిలో నియమించుకునేందుకు పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కు వచ్చిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు తిరిగి యాక్టివ్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు తమ క్యాడర్ను పెంచుకునే పనిలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతోంది. ముజఫరాబాద్ లోని చేలబండి క్యాంప్ నుంచి ఎల్ఓసీ వద్ద ఉన్న నీలం వ్యాలీకి క్యాడర్ను తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఖైబర్ ఫఖ్తుంక్వాలోని అటవీ ప్రాంతంలో 400 మందికి ఉగ్రవాదంలో హిజ్బుల్ ముజాహీద్దీన్ సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
ఇక భారత్లోకి చొరబడేందుకు జైషే మొహ్మద్ సంస్థ ఒక్కటే ప్రయత్నం చేయడం లేదని..దీంతో పాటు అల్ బదర్ సంస్థ అనే మరో ఉగ్రవాద సంస్థ కూడా బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి ప్రవేశించాలని చూస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్లోని ఎల్ఓసీ వద్ద గస్తీ పెంచడంతో భారత్-బంగ్లా సరిహద్దులను ఈ ఉగ్రవాద సంస్థ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.