మూడు దేశాల సమావేశానికి 'జై' అని నామకరణం చేసిన మోడీ... 'జై' అంటే ఏమిటో తెలుసా..?
Recommended Video
బ్యూనస్ ఏరీస్ : జీ 20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ ప్రధాని షింజో అబేలతో భేటీ అయ్యారు. ఇండో పసఫిక్ ప్రాంత దేశాలను ఆర్థిక శక్తిగా మలచడంలో తమ వంతు పాత్ర భారత్ పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముగ్గురు అగ్రనాయకులు తొలిసారిగా భేటీ అవడంతో ప్రపంచదేశాలు ఈ సమావేశాన్ని చాలా ఆసక్తిగా తిలకించాయి. జపాన్, అమెరికా, ఇండియా దేశాల పేర్ల నుంచి ఆంగ్లంలో తొలి అక్షరాన్ని తీసి ఒక పదంగా కూరిస్తే జై వస్తుందన్న ప్రధాని దీనికి హిందీలో అర్థం విజయం అని చెప్పారు.
ఇండో పసిఫిక్ దేశాల అభివృద్ధి పై చర్చ
జై సమావేశంలో మూడు దేశాలు అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు మోడీ. ఈ చర్చల్లో భాగంగా సహకారం, ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడటం జరిగిందన్నారు. అంతేకాదు ప్రపంచ శాంతి కోసం మూడు దేశాలు స్థిరంగా పనిచేస్తాయని ప్రతిజ్ఞ చేసినట్లు ప్రధాని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ప్రధాని ఐదు పాయింట్లను సూచించారు. అన్ని దేశాలు ఒకరితో ఒకరు అనుసంధానం, స్థిరమైన అభివృద్ధి, విపత్తు ఉపశమనం, సముద్ర భద్రతలపై కలిసి పనిచేస్తే శాంతి సాధ్యమవుతుందని ప్రధాని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి విషయంలో, ఒక దేశం పట్ల గౌరవం సమగ్రత పెంపొందించుకోవడంపై ఏకాభిప్రాయం కలిగి ఉండాలని సూచించారు.
భారత్తో మా స్నేహం చాలా దృఢమైనది : ట్రంప్
మూడు దేశాల మధ్య అనుబంధం చాలా దృఢమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇక భారత్తో అమెరికా బంధం మరింత బలపడిందని చెప్పారు. ఇరుదేశాలు కలిసి చక్కగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు ట్రంప్. భారత్ అమెరికాలు వాణిజ్యరంగంలో రాణిస్తున్నాయని చెప్పిన ట్రంప్... రక్షణ రంగంలో మిలటరీ ఆయుధాల కొనుగోళ్ల విషయంలో కూడా సహకరించుకుంటున్నట్లు చెప్పారు. తొలిసారిగా జరిగిన మూడు దేశాల జై సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు జపాన్ ప్రధాని షింజో అబే. అంతేకాదు మూడేదేశాల మధ్య అనుబంధం సహాయసహకారాలు ఇండో పసఫిక్ దేశాలను అభివృద్ధి పథం వైపు నడుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సముద్ర సరిహద్దులపై డ్రాగన్ కంట్రీ వివాదం
చైనాలోని దక్షిణ చైనా సముద్రం, జపాన్లోని తూర్పు చైనా సముద్ర సరిహద్దులపై ఇప్పటికే చైనా జపాన్తో వివాదానికి దిగుతున్న నేపథ్యంలో ఈ మూడు దేశాల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు ప్రాంతాల్లో అపారమైన ఖనిజ సంపద, చమురు, ఇతర సహజ వనరులు విస్తారంగా ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమదే అని చైనా దబాయిస్తుండగా... వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనే, తైవాన్ దేశాలు కూడా తమకు అందులో వాటా ఉన్నాయని వాదిస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా 3 ట్రిలియన్ అమెరికా డాలర్లు నష్టం వాటిల్లుతోంది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా బలగాలు పాట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. కొన్ని దీవులను చైనా తన అధీనంలోకి తీసుకుందని అమెరికా బలగాలు వెల్లడించాయి.