భారత్ నుంచి ఉగ్రవాదులకు డ్రగ్స్?: ఇటలీలో రూ. 375కోట్ల విలువైన టాబ్లెట్లు సీజ్
రోమ్: మరో సంచలన విషయం వెలుగుచూసింది. భారత్ నుంచి లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు వెళుతున్న డ్రగ్స్ భారీ మొత్తంలో పట్టుబడ్డాయి. ఐసిస్కు చెందిన 50 మిలియన్ యూరోల(భారత కరెన్సీలో దాదాపు రూ.375కోట్లు) విలువైన డ్రగ్స్ను ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటిని భారత్ నుంచి లిబియా తరలిస్తుండగా ఇటలీ భద్రతా దళాలు పట్టుకోవడం గమనార్హం. భారత్ నుంచి సముద్రమార్గం ద్వారా లిబియా వెళ్తున్న ఓ నౌకను గోయియా టారో పోర్ట్ వద్ద ఇటలీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. అందులో 24 మిలియన్లకు పైగా ట్రమడాల్ అనే సింథటిక్ డ్రగ్ను కనుగొన్నారు. ఇది నొప్పి నివారణ టబ్లెట్ అని గుర్తించారు.
కాగా, ఈ డ్రగ్స్ సాధారణంగా ఐసిస్ ఉగ్రవాదులు 'ఫైటర్ డ్రగ్'గా ఉపయోగిస్తారు. వీటి విలువ 50మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ట్యాబ్లెట్లను ఐసిస్ లిబియాలోని తమ ఉగ్రవాదులకు విక్రయించేందుకు తీసుకెళుతోందని నిఘా అధికారులు భావిస్తున్నారు.
ఈ ట్యాబ్లెట్ల ద్వారా వచ్చిన నిధులను ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ షిప్ భారత్ నుంచి వచ్చినట్లు తెలుస్తోందని, ఈ డ్రగ్స్ను భారత్లోనే తయారుచేశారా? లేదా ఎక్కడైనా చేసి భారత్ నౌక ద్వారా ఎగుమతి చేస్తున్నారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.