మాఫియా లీడర్ : రూ.1,615 కోట్ల ఆస్తులు సీజ్
రోమ్: ఇటలీలో ఓ వ్యాపారవేత్త (మాఫియా కింగ్) నుంచి యాంటీ మాఫియా పోలీసులు రూ. వేల కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్ విలువతో లెక్కిస్తే రూ. 1,615 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.
కంపెనీలు, రియల్ ఎస్టేట్, బ్యాంకు ఖాతాలు, షాపింగ్ మాల్స్ తదితర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 1,615 కోట్లు అని తెలుసుకున్నఅధికారులు షాక్ కు గురైనారు. ఆల్ఫోన్సో అనుంజియాటా అనే వ్యక్తి దాదాపు 20 ఏళ్లు మాఫియా గ్యాంగు తరపున ఆర్థిక లావాదేవీలు నడిపించాడని పోలీసు అధికారులు అంటున్నారు.
అందుకు ప్రతిఫలంగా ఆ వ్యాపారవేత్త ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించాడని అధికారులు చెప్పారు. అనుంజియాటా షాపింగ్ మాల్స్ తో పాటు 85 రియల్ ఎస్టేట్ ఆస్తులు, ఆరు కంపెనీలు, 42 బ్యాంకు ఖాతాలు, రూ. ఐదు కోట్లు (నగదు) స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గత సంవత్సరం మార్చి నెలలోనే అనుంజియాటాను పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ మాఫియా, బెదిరింపులు, అక్రమ రవాణా, మనీలాండరింగ్ రాకెట్లను ఈ మాఫియా నడిపిస్తుందని ఇటాలియన్ పోలీసు అధికారులు చెప్పారు. అంతర్జాతీయ క్రైం సిండికేట్లలో ఇప్పుడు ఇటాలియన్ వ్యాపారవేత్తల పేర్లు బలంగా వినపడుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.