మే నెలలో ఆ దేశం కరోనా నుంచి విముక్తి పొందుతుందా.. నిపుణులు ఏంచెబుతున్నారు..?
ఇటలీ:ఎక్కడో చైనాలో పుట్టిన మహమ్మారి కరోనావైరస్ ఆ దేశాన్ని చిదిమేసిన తర్వాత క్రమంగా ఇతరదేశాలపై కూడా కోరలు చాచింది. ఫలితంగా ప్రపంచదేశాల్లో అటు ప్రజల ప్రాణాలతో పాటు ఇటు ఆర్థిక వ్యవస్థలను కూడా కూల్చింది కరోనావైరస్. కరోనావైరస్ బయటపడ్డ తొలినాళ్లల్లో చైనా తర్వాత ఇరాన్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఇటలీ పోటీలో నిలిచింది. చూస్తుండగానే ఇటలీలో ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అలా చూస్తుండగానే మృతుల సంఖ్యలో చైనాను మించిపోయింది ఇటలీ. తాజాగా ఇటలీలో కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పారు అక్కడి ఆరోగ్యనిపుణులు.
ఇటలీలో మృత్యుహేళ
కరోనావైరస్ బయటపడినప్పుడు తొలిసారిగా చైనాను కబళించింది. ఆ తర్వాత ఇతర దేశాలకు క్రమంగా వ్యాపించి ఆ దేశాలను కూడా నాశనం చేసింది. ఇక ఇటలీలో అయితే ఒక మృత్యుహేళనే నడిచింది. అసలు రోజురోజుకీ పెరుగుతున్న మృతుల సంఖ్యతో అక్కడ స్మశానాల్లో కూడా చోటు లేకుండా పోయిందంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో ఊహించొచ్చు. తాజాగా ఇటలీకి కాస్త ఊరటనిచ్చే వార్తన నిపుణులు చెప్పారు. ఇటలీలో మే నెల 5 నుంచి మే 16 వరకు మరణాలు సంఖ్య తగ్గి కరోనావైరస్ మహమ్మారి రహిత దేశంగా ఇటలీ ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఇనాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్కు చెందిన నిపుణులు సమాచారం సేకరించి దీనిపై స్టడీ చేసి ఈ విషయాన్ని చెప్పారు.
మే నెలలో విముక్తి కలుగుతుందా..?
ప్రస్తుతం సరైనా మార్గంలో నడుస్తున్నామని చెప్పారు ఆ దేశ ఆరోగ్యశాఖ నిపుణుడు ఫ్రాంకో. ప్రస్తుతం ఎలాగైతే స్వీయ నియంత్రణలో ఉంటున్నామో, లాక్ డౌన సందర్భంగా ఇళ్లకే పరిమితం అవుతున్నామో అలానే మరికొన్ని రోజులు కొనసాగిస్తే ఈ మహమ్మారిపై విజయం సాధించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తిరిగి ఇటలీ సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిని కట్టడి చేయడమే ముందున్న లక్ష్యం అని చెప్పిన ఫ్రాంకో.... భవిష్యత్తులో ఇలాంటి వైరస్లు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక తమ వద్ద ఉన్న సమాచారం సేకరించి పరిశోధనలు చేసిన నిపుణులు ఇటలీలోని ఆయా ప్రాంతాలు ఎప్పడు విముక్తి అవుతాయో తేదీలతో సహా వెల్లడించారు. ఇలా ఏప్రిల్ 6తో మొదలు పెడితే మే 5వరకు క్రమంగా ఒక్కో ప్రాంతం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు.
తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు
ఇదిలా ఉంటే అమెరికా తర్వాత కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ కేసులు ఎక్కువగా ఇటలీలోనే ఉన్నాయి. అయితే మార్చి 30 కేవలం 4050 కేసులు మాత్రమే వచ్చాయి. అంటే గత రెండు వారాల్లో ఇదే అతి తక్కువ కేసులు కావడం విశేషం. అంటే సామాజిక దూరం పాటించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కేసుల సంఖ్య తగ్గిందని అర్థమవుతోందని నిపుణులు చెప్పారు. అంతేకాదు ఇక కరోనావైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక మార్చి 9న లాక్డౌన్ విధించడంతోనే కొత్త కేసుల సంఖ్య తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ ఎక్స్పర్ట్ మైక్ ర్యాన్ చెప్పారు. ఇది కేవలం లాక్డౌన్ వల్ల అదే సమయంలో ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లే సాధ్యమైందని ర్యాన్ చెప్పారు.
నిబంధనలను కఠినంగా పాటించడంతోనే...
అత్యధిక కేసులు మరణాలు నమోదైన లాంబార్డీ ప్రాంతంలో కూడా పరిస్థితి మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు. అక్కడ లాక్డౌన్ ప్రభావం చూపిందని వెల్లడించారు. 25,392గా ఉన్న కేసులు తొలిసారిగా 25వేలకు పడిపోయిందని అధికారులు చెప్పారు. గత 10 రోజుల్లో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని ఇటలీ ఆరోగ్యశాఖ డిప్యూటీ మంత్రి పీర్పాలో చెప్పారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ను ప్రకటించారు ప్రధాని.