5శాతం జీడీపీని సాధించడం భారత్కు సవాలే..మోడీపై ఇలా: ప్రముఖ ఆర్థిక వేత్త స్టీవ్ హాంక్
2020వ సంవత్సరంలో భారత్ 5శాతం జీడీపీని సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హాంక్. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీలో ప్రస్తుతం ఎకనామిక్స్ ప్రొఫెసర్గా హాంక్ పనిచేస్తున్నారు. 5శాతం జీడీపీని సాధించడం దాదాపు అసాధ్యమే అన్న హాంక్ ఇందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చారు. నిలకడలేని రుణాలు, నాన్ పెర్ఫార్మింగ్ లోన్లు, రుణాల ఎగవేత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను అంధకారంలోకి నెట్టివేశాయని స్టీవ్ హాంక్ చెప్పారు.
తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడం, రుణాలను ఎగవేయడం వంటివి భారత్లో నిత్యం ఉండే సమస్యే అని చెప్పిన స్టీవ్ హాంక్ 2020లో ఐదుశాతం వృద్ధిరేటును సాధించడం కాస్త కష్టమే అని చెప్పారు. కొన్ని నెలల కిందట భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పెరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ సరసన నిలిచిందని గుర్తు చేసిన స్టీవ్ హాంక్... ప్రస్తుతం గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా వృద్ధి రేటు 4.5శాతానికి పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. పెట్టుబడుల్లో వేగం తగ్గడం, వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి పెరగడం, ఉద్యోగాల కల్పన లేకపోవడంతోనే ఈ స్థాయికి పడిపోయిందని ఆయన చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఆర్థిక సలహాదారుల్లో ఒకరుగా పనిచేసిన స్టీవ్ హాంక్ ... భారత్లో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో మోడీ సర్కార్ విఫలమైందని అన్నారు. కఠినమైన నిర్ణయాలు, అవసరమైన సంస్కరణల తీసుకురావడంలో మోడీ సర్కార్ ఆసక్తి కనబర్చడం లేదని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం మానేసి మతపరమైన ఇతర అనవసర విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తోందని స్టీవ్ చెప్పారు. మోడీ నేతృత్వంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రూపాంతంరం చెందుతుందని అంతా భావిస్తున్నారని చెప్పిన స్టీవ్ హాంక్.... అది అవాస్తవమని చెప్పారు. మోడీ నేతృత్వంలో భారత్ అతిపెద్ద పోలీస్ రాజ్యంగా అవతరిస్తోందని చెప్పారు. హాంక్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ పంపగా ఎలాంటి స్పందన రాలేదు.