ఇకపై వారానికి నాలుగు రోజులే పని: ‘అలీబాబా’ జాక్ మా
డెట్రాయిట్: కొన్ని దేశాల్లో వారానికి ఆరు రోజులు, మరికొన్ని దేశాల్లో వారానికి ఐదు రోజులు పనిదినాలున్న విషయం తెలిసిందే. అయితే, రాబోయే రోజుల్లో వారానికి నాలుగు రోజులే పని దినాలుండబోతున్నాయని అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా స్పష్టం చేశారు. ఇందుకు కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అని తెలిపారు.
జీవిత సుఖమయం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయం కానుందని అన్నారు. వచ్చే 30ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమేనని జాక్ మా పేర్కొన్నారు.
గేట్ వే 17 కాన్ఫరెన్స్లో..
డెట్రాయిట్లో జరిగిన గేట్వే 17 కాన్ఫరెన్సులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై జాక్ మా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంతో పోల్చుకుంటూ ఇప్పటికే పని గంటలు చాలా తగ్గిపోయాయని చెప్పారు.
బిజీగా ఫీలవుతున్నామంతే..
‘మా తాతగారు పొలంలో రోజుకు 16 గంటలు పనిచేశారు. దీన్ని బట్టి అప్పుడు చాలా బిజీగా ఉండి ఉంటారు. ఇప్పుడు మనం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నాం. అది కూడా వారానికి 5 రోజులు పని చేస్తూ చాలా బిజీగా ఉన్నట్టు అనుకుంటున్నాం' అని జాక్ మా చెప్పారు.
మూడో ప్రపంచ యుద్ధమూ రావొచ్చు..
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ పైనా వివరంగా మాట్లాడిన ఈ చైనా బిలియనీర్... ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజు రోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవని హెచ్చరించారు. అది యుద్ధానికి కూడా దారితీయవచ్చునని అభిప్రాయపడ్డారు. మూడోతరం టెక్నాలజీ విప్లవం... మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చని జాక్ మా పేర్కొన్నారు.