అలీబాబా గ్రూప్కు జాక్మా గుడ్బై, వారసుడెవరో తెలుసా..?
చైనా: జాక్మా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సంస్థ అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు. అతి తక్కువ కాలంలోనే డబ్బులు ఎలా సంపాదించాలి అని ప్రపంచానికి పాఠాలు నేర్పిన ఘనాపాటీ. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపార స్రామాజ్యాన్ని ప్రపంచనలమూలలకు విస్తరించిన మేధావి జాక్మా. ఇప్పుడు అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ నుంచి తప్పుకుని ఆ బాధ్యతలను మరొకరికి అందజేశారు జాక్మా.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి ఊర్మిళ ...!
అలీబాబా సంస్థకు గుడ్బై చెప్పేసిన జాక్మా
చైనాలోనే అతి పెద్ద సంస్థ అయిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్కు ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్గా వ్యవహరించిన జాక్మా ఇక గుడ్బై చెప్పనున్నారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మొత్తం 41.8 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించిన జాక్మాను ఆసియా ఖండంలో భారత్కు చెందిన ముఖేష్ అంబానీ మాత్రమే దాటగలిగారు. చైనా రెండవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే ఇందులో కచ్చితంగా జాక్మా హస్తం ఉందనే చెప్పాలి.
ఈ కామర్స్ రంగంలో చరిత్ర సృష్టించిన జాక్మా
రెండు దశాబ్దాలకు పైగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు జాక్మా మరియు అతని భాగస్వాములు. ఈ కామర్స్ రంగంలో ఓ చరిత్ర సృష్టించిన జాక్మా పలు సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు స్ఫూర్తినిచ్చారు. అంతేకాదు లాజిస్టిక్ నెట్వర్క్ద్వారా ప్రతిరోజూ కొన్ని మిలియన్ పార్శిళ్లను డెలివరీ చేస్తోంది అలీబాబా సంస్థ. ఇక తన 55వ పుట్టిన రోజు సందర్భంగా తన వారసుడిగా అలీబాబా సంస్థ ఫైనాన్స్ దిగ్గజం డేనియేల్ జాంగ్ను ప్రకటిస్తూ బాధ్యతలు అప్పగించారు.
పలు కంపెనీల్లో ఉద్యోగానికి ప్రయత్నించి విఫలం
2016లో డాలియన్ వాండా గ్రూప్ ఛైర్మెన్ వాంగ్జియాన్లిన్ను దాటుకుని ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆ టైటిల్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీపై ఉంది. చైనా వాణిజ్యరంగాన్ని ముందుకు నడిపిన జాక్మా, కమ్యూనిస్ట్ పార్టీ నేత కూడా. 2015లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన జాక్మా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేఎఫ్సీ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా తన దరఖాస్తును కంపెనీ తిరస్కరించిందని చెప్పారు. ఇప్పుడు అలీబాబా సంస్థలో 5.3శాతం వాటాలు అంటే 24.6 బిలియన్ డాలర్లు మేరా వాటా కలిగి ఉన్నారు. ఇక 2013లో అలీబాబా సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన రెవిన్యూ అమాంతంగా 1,100 శాతంకు పెరిగింది. అంటే 56.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
పార్శిల్ డెలివరీ నుంచి ఈ-కామర్స్ వరకు..
ఒక్క అలీబాబా వ్యాపార సామ్రజ్యం నుంచి మాత్రమే ఇంత ఆస్తులు సంపాదించిన వ్యక్తిగా నిలిచారు జాక్మా. అలీబాబా సంస్థను నమ్ముకుని పనిచేసిన వ్యక్తులు దాదాపు 10 మంది బిలయనీర్లుగా మారారు.ముందుగా పార్శిల్ డెలివరీతో ప్రారంభమైన కంపెనీ ఆ తర్వాత సూపర్మార్కెట్లు, ఆ తర్వాత ఈకామర్స్తో చరిత్ర సృష్టించింది. జాక్ మా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ-కామర్స్ వృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తానని చెప్పారు. ఈ సమయంలో జాక్మా సలహాల మేరకే జాంగ్ ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.