పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ కన్నుమూత
లండన్/కరాచి: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ షరీఫ్ కన్నుమూశారు. ఆమె లండన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు.
ఆమె లండన్లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ ఆసుపత్రిలో 2014 జూన్ నుంచి చికిత్స పొందుతున్నారు. ఆమె వయస్సు 68. ఆమె మృతిని పాకిస్తాన్ ముస్లీం లీగ్ అధ్యక్షులు షెహబాజ్ షరీఫ్ కన్ఫర్మ చేశారు. మా వదిన చనిపోయిందని ఉర్దూలో ట్వీట్ చేశారు.
నవాజ్ షరీఫ్, కుల్సూమ్ల వివాహం 1971లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమెను చూడటానికి తరచూ లండన్కు వెళ్లేవారు 2017 ఆగస్ట్లో కుల్సూమ్ గొంతు క్యాన్సర్కు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆమె మృతిచెందారు.
అవినీతి కేసులో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం షరీఫ్ ప్రస్తుతం రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.