ఉగ్రవాదే: భారత్ వాదనకు బలం చేకూర్చిన ముషారఫ్
ఇస్లామాబాద్: తొలిసారి భారత వాదనకు సానుకూలంగా స్పందించారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదంటూ భారత్ వాధిస్తున్న విషయం తెలిసిందే. అతడ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ పోరాటం చేస్తున్న విషయం కూడా విధితమే.
ఈ నేపథ్యంలో ముషారఫ్ సైతం.. మసూద్ ఓ ఉగ్రవాది అని తేల్చి చెప్పారు. తమ దేశంలోనూ అతను బాంబు పేలుళ్లు చేశాడని చెప్పారు. అయితే, అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని చైనా ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించగా.. ముషారఫ్ సూటిగా సమాధానమివ్వలేదు. అతనితో చైనాకు ఏం సంబంధమని ఎదురు ప్రశ్నించారు.
భారత్లో పాక్ హైకమిషన్ ఉద్యోగి గూఢచర్యం చేస్తున్న కేసు గురించి ప్రస్తావించగా.. మొదట ఆ విషయం తనకు తెలియదని ముషారఫ్ అన్నారు. ఆ వెంటనే స్పందిస్తూ.. నిజంగా అలా జరిగి ఉంటే.. అలాంటివాటిని ప్రోత్సహించకూడదని స్పష్టంచేశారు. ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ వివిధ అంశాలపై స్పందించారు.
నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో దూకుడు లేదని ఈ సందర్భంగా ముషారఫ్ అన్నారు. పాక్ ప్రభుత్వ దౌత్య వైఫల్యం నిజమేనని చెప్పారు. అయితే అంతమాత్రాన పాకిస్థాన్ను తక్కువ అంచనా వేయకూడదన్నారు. రాజకీయ నాయకత్వం, ఆర్మీల్లో ఏది పాక్ అభివృద్ధికి మేలని ప్రశ్నించగా.. ఆర్మీ హయాంలోనే దేశం వృద్ధి సాధించిందని చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల క్యాంపుల గురించి ప్రశ్నించగా.. తనకు తెలియదన్నారు. ఆ తర్వాత నవ్వుతూ.. అక్కడ ఎన్ని క్యాంపులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మీకు చెబుతానని చెప్పారు. అమెరికాతో పాక్ సంబంధాలు దెబ్బతినడంపై స్పందిస్తూ.. కొన్ని వివాదాస్పద అంశాలపై పాక్ ఆర్మీ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్పై స్పందిస్తూ.. పాక్ అణుదేశమని, తమను ఎవరూ బెదిరించలేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ సడెన్గా పాక్ రావడం, షరీఫ్ను కలవడం కూడా ముషారఫ్ స్పందించారు. షేక్హ్యాండ్స్ ఇచ్చుకున్నంత మాత్రాన ఏమీ జరగదని, వివాదాల పరిష్కారానికి కొన్ని బలమైన పరిష్కారాల గురించి ఆలోచించాలని అన్నారు. ఏదేమైనా మసూద్ లాంటి ఉగ్రవాదిని ఉగ్రవాది అని ఆ దేశ మాజీ అధ్యక్షుడే తేల్చడం అభినందనీయం.