కుల్గాం కాల్పుల్లో జైషే మహ్మద్ హస్తం..? నిఘావర్గాల అనుమానం
కశ్మీర్ కుల్గాంలో కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని నిఘావర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కుల్గాంలో పశ్చిమబెంగాల్కు చెందిన కూలీలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతున్నారు.
కార్మికులపై దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దీంతో జైషే మహ్మద్ సంస్థ దాడికి తెగబడి ఉండొచ్చని నిఘావర్గాలు భావిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ విభజన తర్వాత యూరొపియన్ యూనియర్ ఎంపీలు కశ్మీర్ను సందర్శించిన రోజు కాల్పులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కుల్గాం కాల్పులను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. విపక్షాలు, బెంగాల్ సీఎం కూడా దుశ్చర్యగా అభివర్ణించారు. ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ యూనిట్ కూడా దిగ్బాంతి వ్యక్ం చేసింది. కాల్పుల తర్వాత కశ్మీర్, కుల్గాం.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జమ్ముకశ్మీర్ విభజన తర్వాత ఉగ్ర మూకలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కశ్మీరేతర పర్యాటకులు, కూలీల లక్ష్యంగా దాడులకు తెగబడి భయాందోళన కలిగిస్తున్నారు. సోమవారం ఉదమ్పూర్లో ట్రక్కులపై దాడిచేసి డ్రైవర్ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న సోపియన్ జిల్లాలో కశ్మీరేతర ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన ఇద్దరు ఉగ్రవాదులు, ఓ పాకిస్థాన్ జాతీయుడు సోపియన్లో ట్రక్కు డ్రైవర్ను మట్టుబెట్టారు. డ్రైవర్ పేరు షరిఫ్ ఖాన్ అని పోలీసులు గుర్తించారు.