తీరుమార్చుకోని పాక్.. యధాతథంగా బాలాకోట్: ఈ సారి మరింత భారీగా ఉగ్రవాదుల శిబిరాలు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోలేదు. బుద్ధిని పోనిచ్చుకోలేదు. భారత్ పై దాడులు చేపట్టేలా ఉగ్రవాదులను వెన్నతట్టి ప్రోత్సహించేలా ప్రవర్తిస్తోందనే విమర్శలు మరోసారి వెల్లువెత్తాయి. జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దులకు అవతల పాకిస్తాన్ భూభాగంలో ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న బాలాకోట్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు మళ్లీ తమ కార్యకలాపాలను ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ సారి ప్రభుత్వమే వాటిని దగ్గరుండి ఏర్పాటు చేయించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకంటి కంటే కూడా అధిక సంఖ్యలో బాలాకోట్ లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు మనదేశ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అందజేసినట్లు సమాచారం.
నాడు నేలమట్టం.. నేడు పునరుజ్జీవం
ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహూతి దళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన చోటు చేసుకున్న 12 రోజుల తరువాత భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై వైమానిక దాడులను నిర్వహించింది. బాలాకోట్ లో ఏర్పాటైన అతి పెద్ద ఉగ్రవాదుల శిబిరాన్ని నేలమట్టం చేసింది. ఆ ఘటనలో సుమారు 35 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తేలినప్పటికీ.. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ధృవీకరించలేదు. వైమానిక దాడుల తరువాత కొన్ని రోజుల పాటు ఉగ్రవాద కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అదే సమయంలో మసూద్ అజర్ అరెస్టు అయ్యారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాతే..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించంపై పాకిస్తాన్ తన అక్కసును వెల్లగక్కుతోంది. ఈ క్రమంలోనే- ఉగ్రవాదులను సైతం దగ్గరుండి ప్రోత్సహిస్తోందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆర్టికల్ 370ని పునరుద్ధరించేలా భారత్ పై ఒత్తిడిని తీసుకుని రావడానికి అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కు చుక్కెదురైంది. దీనితో తనకు అలవాటైన రీతిలో భారత్ పై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి పాకిస్తాన్ సంకల్పించిందని, ఇందులో భాగంగా.. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. మనదేశ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన సమాచారం ఈ అనుమానాలను బలపరుస్తోంది.
బాలాకోట్ లో మళ్లీ తిష్ఠ వేసిన జైషె మహమ్మద్
ఎక్కడైతే భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ ను చేపట్టిందో.. అదే చోట మళ్లీ ఉగ్రవాద శిబిరాలు వెలిసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు కీలక సమాచారాన్ని అందజేసినట్లు చెబుతున్నారు. గతంలో కంటే అధికంగా ఉగ్రవాదులు అక్కడ శిక్షణ పొందుతున్నారనే విషయాన్ని ఉంటంకించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలు, ఐఎస్ఐ ఏజెన్సీల నుంచి ఈ ఉగ్రవాద శిబిరాలకు మద్దతు లభిస్తోందని ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు. వారి ప్రోత్సాహంతోనే ఉగ్రవాదులు తరచూ సరిహద్దులను దాటుకుని భారత్ మీదికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ సరిహద్దులతో పాటు గుజరాత్ లోని సర్ క్రీక్ సముద్ర జలాల ద్వారా భారత్ లోకి చొచ్చుకుని రావడానికి ఉగ్రవాదులు ఇదివరకే విఫల ప్రయత్నాలు చేసిన సందర్భాలను అధికారులు ఇందుకు ఉదహరిస్తున్నారు.