భార్యతో విమానంలో అసాధారణ ప్రయాణం -ఆమెపై ప్రేమకాదు.. కరోనా అంటే భయం వల్ల..
గడిచిన 14 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయకాలంలో భాయనక విషాదాలు, అంతులేని వైరగ్యాలు, ఆర్థిక పతనాలతోపాటు వింతలు, విశేషాలెన్నో చూశాం. అదే సమయంలో మనుషులు కాస్త శుభ్రత, సామాజిక క్రమశిక్షణ, పరిశుభ్రత కూడా నేర్చుకున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులకు శానిటైజర్ ఇప్పుడు న్యూ నార్మల్. ఇక ప్రయాణాల్లోనైతే కొందరు రక్షణ కోసం పీపీఈ కిట్లు కూడా ధరిస్తున్నారు. అయితే..
ఇండోనేషియా రాజధాని జకార్తాకు చెందిన ఓ బడాబాబు మాత్రం కరోనా నుంచి రక్షణ కోసం కాస్త అతి జాగ్రత్త తీసుకుని వార్తల్లోకెక్కాడు. విమాన ప్రయాణంలో ఇతరుల నుంచి కరోనా సోకుతుందేమోననే భయంతో ఆయన ఏకంగా విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు. ఆ ప్రయాణికుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ అనే సోషలైట్ ఇటీవల బాలీకి వెళ్లారు. రిచర్డ్ వెంట అతడి భార్య షల్విన్నీ ఛాంగ్ కూడా ఉన్నారు. ఈ ప్రయాణం కోసం ఆయన లయన్ ఎయిర్ గ్రూప్నకు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలో అన్ని టికెట్లనూ బుక్ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని ఇలా చేసినట్లు రిచర్డ్ తెలిపారు.
వందల సీట్లున్న విమానం ఖాళీగా దర్శనమిస్తోన్న ఫోటోను రిచర్డ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ''ఫ్లైట్లో సీట్లన్నీ బుక్ చేశా.. అయినా, ప్రైవేట్ జెట్ కంటే తక్కువే ఖర్చయ్యింది. మాకు కరోనా సోకే ప్రమాదం లేదు. విమానంలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాం''అని రిచర్డ్ రాసుకొచ్చారు. అయితే..
కరోనా భయంతో విమానంలోని సీట్లన్నీ బుక్ చేసుకున్నట్లు డాబు ప్రదర్శించిన బడాబాబు రిచర్డ్.. దానికి ఎంత ఖర్చయ్యిందనే వివరాలను మాత్రం చెప్పలేదు. విమానం మొత్తం బుక్ చేసుకున్నా.. ప్రైవేట్ జెట్లో ప్రయాణ ఛార్జీల కంటే తక్కువే అయిందని ఆయన చెప్పడం గమనార్హం. కాగా..రిచర్డ్ కథకు బాలిలోని బాతిక్ ఎయిర్ యజమానులు ట్విస్ట్ ఇచ్చారు. తన వాదనలకు విరుద్ధంగా తాము ఇద్దరు ప్రయాణికులను మాత్రమే టికెట్లు బుక్ చేశామని ఎయిర్ లైన్సు తెలిపింది.