ఉగ్రవాద సంస్థలతో కలిసేందుకు సిద్ధం: కాశ్మీర్పై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
తద్వారా భారత్కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై ముషారఫ్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు దేశభక్తి కలిగినవి అని ప్రశంసించారు.
దేశ భద్రత కోసం ఈ సంస్థలతో కలిసి ఎన్నికల్లో పని చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఈ సంస్థల్లో పని చేసేవారు కేవలం పాకిస్తాన్ కోసమే జీవిస్తున్నారని, పాకిస్తాన్ కోసమే మరణిస్తున్నారని చెప్పారు.
ఈ సంస్థలు కలిసి రాజకీయ పార్టీని స్థాపిస్తే, ఇతరులు అబ్యంతరాలను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వారితో పొత్తుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
తనలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్యలను తాను ఎప్పుడూ సమర్థిస్తుంటానని తెలిపారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్కు రక్షణగా ఉన్నారన్నారు. హఫీజ్ సయీద్కు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.