Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికా
అమెరికా సౌదీ అరేబియా దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికను బహిర్గతం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ వారి వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా నిషేధం దిశగా కూడా అడుగులు వేసింది బైడెన్ ప్రభుత్వం. జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం జరిగిన ప్రచారంలో పలు హామీలు ఇచ్చారు.
హామీలను నిలబెట్టుకుంటున్న బైడెన్
ఇందులో భాగంగానే ప్రధాన చమురు ఉత్పత్తి దేశంగా ఉన్న సౌదీ అరేబియా ట్రంప్ హయాంలో అమెరికాకు మిత్రపక్షంగా ఉన్నందున మానవహక్కుల ఉల్లంఘనకు అడ్డు అదుపూ లేకుండా పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. ట్రంప్ కూడా ఇందుకు సహకరించారనే వాదనలు ఉన్నాయి. దీంతో అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకొస్తానంటూ బైడెన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీలను నిలబెట్టేందుకు ముందుగా జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు సంబంధించిన అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఖషోగ్గి హత్యగావించబడ్డారనే విషయాన్ని నిఘా వర్గాలు బహిర్గతం చేయడంతో బైడెన్ చర్యలకు ఉపక్రమించారు.
సౌదీ పౌరులపై ఆంక్షలు
2018 అక్టోబర్ 2వ తేదీన అమెరికా జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు గురయ్యాడు. సౌదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వార్తలు రాయడంపై ఆగ్రహం చెంది, ఖషోగ్గిని హత్య చేశారని... సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని అమెరికా నిఘావర్గాలు నివేదిక బహిర్గతం చేశాయి.నివేదికలో సౌదీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్-అసిరి పేరు ఉండటంతో ఆయనపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు విధించింది. అంతేకాదు సౌదీ రాయల్ గార్డ్స్ ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ ఫోర్స్పై కూడా ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఖషోగ్గి హత్యలో ఆర్ఐఎఫ్ పాత్ర ఉందని నిర్థారించింది. ఆంక్షల్లో భాగంగా అమెరికా ఆస్తులను సౌదీ పౌరులు కలిగి ఉంటే వారితో అమెరికా పౌరులు ఎలాంటి సంబంధాలు నెరపరాదంటూ ఆంక్షలు విధించింది బైడెన్ సర్కార్.
జర్నలిస్టుల కోసం కొత్త విధానాలు
ఇక జర్నలిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేస్తున్న దేశాలపై అమెరికా తీసుకొచ్చిన నూతన విధానం ప్రకారం సౌదీ అరేబియాకు చెందిన 76 మంది పౌరులపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. అంతేకాదు ఈ పౌరుల కుటుంబ సభ్యులపై కూడా ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం వీసా ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది ప్రభుత్వం. తమ సరిహద్దులపై దుస్సాహసం ప్రదర్శించే ఏ దేశాలైనా సరే అమెరికా గడ్డపై అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక జర్నలిస్టులను వారి హక్కులను కాపాడుకునే క్రమంలో అమెరికా ప్రభుత్వం ఓ డాక్యుమెంట్ను తయారు చేస్తోందని వెల్లడించింది.