జపాన్లో భారీ భూకంపం: 8మంది మృతి, 140మందికిగాయాలు, కూలిన భవనాలు, అంధకారం..
టోక్యో: జపాన్లోని హొక్కాయిడో ద్వీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడి, పలు భవనాలు కుప్పపూలాయి.
8మంది మృతి, 140మందికి గాయాలు
భూకంప ధాటికి ఇప్పటి వరకు 8మంది మృతి చెందగా, దాదాపు 140మందికి గాయాలయ్యాయి. మరో 40మంది ఆచూకీ తెలియట్లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కుప్పకూలిన భవనలు, విరిగిపడిన కొండచరియలు
కుప్పకూలిన భవనాలు, కొండచరియలు కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ దెబ్బతినడంతో సుమారు 3లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విమానాల రాకపోకల నిలిపివేత
కొన్ని రోజులుగా జపాన్లో జెబీ తుఫాను సృష్టిస్తున్న ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రజలు.. తాజా భూకంపంతో మరోసారి విపత్తుకు గురయ్యారు. కాగా, హొక్కాయిడోలోని న్యూ చిటోస్ విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేశారు. అలాగే, రైల్లు, బస్సు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేసినట్లు అధికారులు తెలిపారు.
సునామీ ప్రమాదం లేదు కానీ..
అయితే, భూకంపం కారణంగా సునామీ ముప్పు ఏమీ లేదని అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద పెద్ద భవనాల వైపు వెళ్లకూడదని సూచించారు. టోమకొమయిలో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.