మరో కొత్త రకం కరోనా.. ఈ సారి జపాన్లో వెలుగులోకి... మరింత శక్తిమంతంగా..
కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో గల వుహాన్లో ఆవిర్భవించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే కరోనాకు సంబంధించి రకరకాల వైరస్ బయటకు వస్తోంది. యూకేలో కరోనా స్ట్రెయిన్ బయటపడిన సంగతి తెలిసిందే. చాలారోజుల తర్వాత మరో రకం కరోనా వైరస్ బయటపడింది. అదీ జపాన్లో అప్పీర్ అయ్యింది.
Recommended Video
2019 చివరిలో తొలుతు చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ తర్వాత ప్రపంచాన్ని వణికించింది. దీంతో లాక్డౌన్లు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అయినా వైరస్ను పూర్తిగా నివారించని పరిస్థితి. కోవిడ్ నియంత్రణలోకి వస్తుందనుకునే తరుణంలో కొత్త తరం కరోనా వైరస్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్ దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు వచ్చాయి. తాజాగా జపాన్లో మరో కొత్త రకం కరోనాను గుర్తించారు.
కాంటే ప్రాంతంలో కొత్త రకం మహమ్మారిని గుర్తించామని జపాన్ అధికారులు వెల్లడించారు. కాంటేలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే దీన్ని నియంత్రించడానికి టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కొత్త వైరస్ వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని వైద్యాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్లో వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే ఈ484కె మ్యుటేషన్ గుర్తించారని తెలుస్తోంది. కొత్త వైరస్ మరింత త్వరగా వ్యాపించవచ్చునని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.