డ్రాగన్ కంట్రీకి జపాన్ బిగ్ షాక్ ... చైనా నుండి భారత్ కు కంపెనీలు తరలిస్తే భారీ రాయితీలు
చైనా పై వాణిజ్య సమరానికి సిద్ధమయ్యాయి ప్రపంచ దేశాలు. ముఖ్యంగా యూఎస్, ఆస్ట్రేలియా ,జపాన్ ,ఇండియా, చైనాను వాణిజ్యపరంగా దెబ్బకొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుని చైనా కంపెనీలకు వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా జపాన్ మరో షాక్ ఇచ్చింది. ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్న చైనాకు చెక్ పెట్టడం కోసం జపాన్ సైతం రంగంలోకి దిగింది.
Recommended Video
దిగ్గజ దేశాల క్వాడ్ మంత్రివర్గ భేటీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపధ్యంలో చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా దేశాల్లో వ్యాపారాలు విస్తరించాలని జపాన్ ఆలోచన
చైనా నుండి భారత్, బంగ్లాదేశ్ లకు జపాన్ సంస్థలను తరలించే తమ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆసియా దేశాలన్నింటిలోనూ తమ దేశానికి చెందిన సంస్థలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్న జపాన్ ఇదే అదునుగా భావించి అడుగులు ముందుకు వేస్తోంది. భారీగా రాయితీలను ప్రకటించి జపాన్ సంస్థలను భారత్ లో విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం కావలసిన బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది.
బడ్జెట్ కేటాయింపు .... భారత్ , బంగ్లాదేశ్ కు తరలించే కంపెనీలకు భారీ రాయితీలు
2020 -2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆసియాన్ ప్రాంతంలో కంపెనీల విస్తరణను ప్రోత్సహించాలని 23,500 కోట్ల యెన్లు (22.1 కోట్ల డాలర్లు) కేటాయించింది జపాన్ ప్రభుత్వం. చైనా లో ఉన్న జపాన్ సంస్థలు ఏవైనా తమ సంస్థలను భారత్ కు గాని ,బంగ్లాదేశ్ కు గానీ మారిస్తే భారీగా రాయితీలు ఇస్తామని ప్రకటన చేస్తోంది. ఇదే విషయాన్ని నిక్కీ ఏషియన్ రివ్యూ నివేదిక వెల్లడించింది. జపాన్ సంస్థలకు సంబంధించిన ఎలక్ట్రానిక్, మరియు ఔషధ ఉత్పత్తులన్నింటిని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది జపాన్ .
వాణిజ్య సమరంలో భాగమే ... జపాన్ నిర్ణయం
ఈ నిర్ణయంతో చైనాకు చెక్ పెట్టడంతో పాటు గా, తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించనుంది. ప్రస్తుతం జపాన్ కు చెందిన ఉత్పత్తి ప్లాంట్లు చైనాలోనే అత్యధికంగా ఉండగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో అక్కడ కూడా ఉత్పత్తి ఆగిపోయింది. ఇక ఇదే అదునుగా భావించి ఇప్పుడు కంపెనీలను తరలిస్తే జపాన్ రాయితీలు ఇస్తామని చెప్పడం సదరు పారిశ్రామిక వర్గాలకు ఆశలను చిగురింప చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్ కంట్రీ చైనాపై ప్రపంచమంతా మండిపడుతున్న పరిస్థితులతో పాటు, చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితులు మొత్తంగా చైనాపై వాణిజ్య సమరానికి ప్రధాన దేశాలన్నీ సిద్ధమయ్యాయి.
చైనాలోని జపాన్ సంస్థలకు బంపర్ ఆఫర్ ... ఇండియాలో పెట్టుబడులు
జపాన్ కంపెనీలను భారత్ కు తరలించారని నిర్ణయం తీసుకోవడం, అలా తరలిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని బంపర్ ఆఫర్ ఇవ్వటం భారతదేశానికి కూడా కాస్త శుభ సూచకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జపాన్ నిర్ణయంతో ఇండియాలో పెట్టుబడులు పెరుగుతాయన్న ఆశావహ దృక్పథానికి కారణమవుతున్నాయి. ఏది ఏమైనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చైనాకు, వాణిజ్యపరంగా ప్రధాన దేశాలు ఇస్తున్న షాక్ మింగుడు పడడం లేదు.