జోక్యం వద్దు: భారత్-జపాన్ మైత్రిపై చైనాకు కాలిందక్కడే!
భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది చైనా. భారత్-చైనా సరిహద్దు వివాదంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి చైనా ఘాటుగా వ్యాఖ్యానించింది.
బీజింగ్: భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది చైనా. భారత్-చైనా సరిహద్దు వివాదంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి చైనా ఘాటుగా వ్యాఖ్యానించింది. భారతదేశంలోని అరుణాచల్ప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో చైనా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
భారత్-జపాన్ మైత్రి..
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ-జపాన్ ప్రధాని షింజో అబే భేటీ నేపథ్యంలో భారత్-జపాన్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, చైనా తలపెట్టిన వన్ రోడ్-వన్ బెల్ట్ ప్రాజెక్టుపై ఆందోళన తదితర అంశాలు ఈ ప్రకటనలో ఉన్నాయి.
చైనా ఆగ్రహం..
అంతేగాక, ‘భారత్-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఫోరంలో భాగంగా ఈశాన్య భారతదేశంలో జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయంపైనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సరిహద్దు ఖరారు కాలేదు..
తూర్పు సెక్టార్లో ఇరుదేశాల సరిహద్దులు స్పష్టంగా ఖరారు కాలేదని, సరిహద్దు విషయమై పలు వివాదాలు ఉన్నాయని చైనా విదేశంగా అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్ అన్నారు.
మూడో వ్యక్తి జోక్యం వద్దు..
ఈ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయని, ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదని జపాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేగాక, దక్షిణ చైనా సముద్రం విషయంలో భారత్-జపాన్ భాగస్తులు కాదని, కాబట్టి ఈ వివాదంతో ఈ దేశాలకు సంబంధం లేదని తెలిపారు.