వావ్ : చంద్రమండలాన్ని చుట్టేయనున్న తొలి వ్యక్తి ఈయనే
చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టింది 1972లో. ఇక అప్పటి నుంచి మానవుడు చంద్రుడిపైకి వెళ్లినట్లు చరిత్రలో లేదు. మళ్లీ ఇంతకాలానికి చంద్రుడిని చుట్టేసేందుకు జపాన్ బిలియనీర్ యుసాకు మెజావా సిద్ధమవుతున్నారు. తాను త్వరలోనే చంద్రుడిపై కాలు మోపనున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ తనను చంద్రుడిపైకి మోసుకెళ్లే రాకెట్ ఎవరిదో తెలుసా... ప్రముఖ అంతరిక్ష రాకెట్ల తయారీ సంస్థ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీది.
చంద్రుడిపై పర్యటించనున్న ప్రయాణికుడు యుసాకు మెజావా
2023లో యుసాకు మెజావా చంద్రుడిపై పర్యటించనున్నట్లు ఎలన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు. కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ కార్యాలయంలో ఎలన్ మస్క్ అధికారిక ప్రకటన చేశారు. బిగ్ ఫాల్కన్ రాకెట్లో యుసాకు మేజావా చంద్రుడిపైకి వెళ్లనున్నట్లు మస్క్ తెలిపారు. ప్రస్తుతం ఆ రాకెట్కు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయని మస్క్ వెల్లడించారు.2016లోనే బిగ్ ఫాల్కన్ రాకెట్ లాంచ్ ప్యాడ్ను మస్క్ ఆవిష్కరించారని స్పేస్ ఎక్స్ కంపెనీ తెలిపింది. అంతరిక్షంలో ప్రయాణించాలన్న ప్రతి ఒక్కరి కలను స్పేస్ ఎక్స్ సాకారం చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతకుముందు అంతరిక్షంలో ప్రయాణించనున్న రెండో వ్యక్తి జపాన్కు చెందిన వ్యక్తి అంటూ ఎలన్ మస్క్ తన ట్విటర్లో చిన్న హింట్ ఇచ్చారు.
ఎవరీ యుసాకు మెజావా..?
యుసాకు మెజావా జపాన్లో ఈకామర్స్ వ్యాపారవేత్త. అప్పటి వరకు యుసాకు ప్రపంచానికి తెలియదు. గతేడాది ఒక దివంగత పెయింటర్ జీన్ మైఖేల్ వేసిన పెయింటింగ్ న్యూయార్క్లో వేలం వేయగా 110.5 మిలియన్ డాలర్లు పోసి కొని వార్తల్లో నిలిచారు. తనతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో ఆరు నుంచి ఎనిమిది మంది ప్రముఖు చిత్రకారులను తీసుకెళ్లనున్నట్లు యుసాకు తెలిపారు. చంద్రుడిపై నుంచి భూమికి చేరుకున్న తర్వాత అక్కడ వారు లోనైన అనుభూతిని చిత్రం రూపంలో ఇవ్వాల్సిందిగా కోరుతానని యుసాకు తెలిపారు.
కొత్త మిషన్ కోసం కొత్త రాకెట్
ఇప్పటివరకు 24 మంది వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్లారని అందులో అంతా అమెరికాకు చెందినవారే. ఇందులో 12 మంది చంద్రుడిపై కాలు మోపారు. 1972లో నాసా అపోలో రాకెట్ ద్వారా వీరు తమ పయనాన్ని సాగించారు. అయితే మేజవా చంద్రుడిపై అడుగుపెట్టడు. చంద్రుడిపై ప్రయాణం చేసి తిరిగి అదే రాకెట్లో భూమికి చేరుకోనున్నాడు. 2017లో తమ సంస్థ నుంచి తయారయ్యే రాకెట్లో ఇద్దరిని చంద్రుడి చుట్టు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎలన్ మస్క్ తెలిపాడు. ఆతర్వాత ఫిబ్రవరిలో మరో ప్రకటన చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థ భవిష్యత్తులో చంద్రమండలంపైకి వెళ్లేందుకు కావాల్సిన రాకెట్ల ఉత్పత్తిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగానే బిగ్ ఫాల్కన్ రాకెట్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఫాల్కన్ రాకెట్కు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను మాత్రమే మస్క్ బయటపెట్టారు.