ఉత్తర కొరియా భయం: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి జపాన్ ఇలా
టోక్యో: ఉత్తర కొరియా నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తున్న జపాన్ రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా యుద్ధ భయంతో ఆందోళనకు గురవుతోంది. ఎన్నో దశాబ్దాల తర్వాత తొలిసారిగా మిలటరీ డ్రిల్ నిర్వహించింది.
అత్యవసర పరిస్థితి ఏర్పడితే రాజధాని టోక్యోను ఎలా వదిలి వెళ్లాలన్న విషయమై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా నగరమంతా మైకుల ద్వారా అణుబాంబు పడనుందని హెచ్చరికలు చేస్తూ తక్షణమే అండర్ గ్రౌండ్కు వెళ్లిపోవాలని సూచించింది.
మిసైల్ దూసుకు వస్తోందంటూ పోలీసుల డ్రిల్
టోక్యో అమ్యూజిమెంట్ పార్క్ వేదికగా ఈ డ్రిల్మను నిర్వహించారు. అక్కడున్న వారందరికి హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశ్యంలో భాగంగా... మిసైల్ దూసుకు వస్తోందని, మిసైల్ దూసుకు వస్తోందని కేకలు పెడుతూ పోలీసులు పరుగులు పెట్టారు.
మిసైల్ వెళ్లిపోయిందని
ప్రతి ఒక్కరూ భవనాల్లోకి, భూగర్భ గృహాల్లోకి, పక్కనే ఉన్న సబ్ వే రైల్వే స్టేషన్ లోకి నిదానంగా వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల అనంతరం, మిసైల్ గ్రేటర్ టోక్యో రీజియన్ దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిపోయిందన్న అనౌన్స్ మెంట్ వినిపించింది.
ఇలా తొలిసారి
ఇంతవరకూ జపాన్లో భూకంపం వస్తే ఎలా తప్పించుకోవాలనే విషయంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఇందుకోసం తరుచూ మిలిటరీ డ్రిల్స్ నిర్వహించేవారు. ఇప్పుడు అణుయుద్ధం ముప్పు కూడా పొంచి ఉండటంతో నగరంలో, మరిన్ని భూగర్భ గృహాలను నిర్మిస్తోంది.
అమెరికా - కొరియాల మధ్య మాటల యుద్ధం
ఇటీవల అమెరికా - ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఉ కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్న వరుసగా మిసైల్ పరీక్షలు నిర్వహించారు. ఓ సమయంలో యుద్ధం దిశగా కూడా అడుగులు పడుతోందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జపాన్ డ్రిల్ నిర్వహించింది.