స్మార్ట్ఫోన్ చూసుకుంటూ యువతి: ఢీకొట్టిన రైలు
టోక్యో: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతోంది నేటి యువత. రోజులో దాదాపు ఎక్కువ సమయాన్ని స్మార్ట్ ఫోన్లకే కేటాయిస్తుండటం గమనార్హం. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రమాదకర రీతిలో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమైన విషయం. రోడ్లపై వెళుతున్నప్పుడు కూడా వాహనాలను గమనించకుండా స్మార్ట్ఫోన్లలోనే మునిగిపోతుండటంతో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా, ఇలాంటి ఘటనే జపాన్లో చోటు చేసుకుంది. తన స్మార్ట్ఫోన్ చూస్తూ.. పరిసరాలను గమనించకుండా ముందడుగేసిన ఓ యువతి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినా.. ఈ ఘటన ఆలోచింపజేసేలా ఉంది.
ఫుజిసవాలో కుగెనుమకైగన్ రైల్వే స్టేషన్లో 17ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ చూస్తూ ఫ్లాట్ ఫాంపై నడుచుకుంటూ వెళుతోంది. అటుగా రైలు వస్తున్నా.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లాట్ ఫాం చివరగా ట్రాక్ దగ్గరగా వెళ్లింది.
ఇంతలో వచ్చిన రైలు.. ఆమె తలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రైలు నెమ్మదిగా రావడం, ఆమె ట్రాక్పై పడకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ అమ్మాయి చిన్నపాటి గాయాలతో బయటపడింది. స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తూ రోడ్లపై, రైల్వే స్టేషన్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదకరమంటున్నారు పెద్దలు.