జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా? కాస్సేపట్లో అధికారికంగా: అర్ధాంతరంగా: కారణం ఇదే
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తప్పుకోబోతున్నారా? తన పదవికి రాజీనామా చేయనున్నారా? ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన అర్ధాంతరంగా వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. షింజో అబే.. రాజీనామా చేయడం ఖాయమైందని, ఈ విషయాన్ని ఆయన కాస్సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ జపాన్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కథనాలను ప్రచురించింది.
తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని జపాన్ జాతీయ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కే వరల్డ్ వెల్లడించింది. రాజీనామా చేయాలనే తన నిర్ణయాన్ని ప్రకటించడానికి షింజో అబే.. విలేకరుల సమావేశాన్ని షెడ్యూల్ చేశారని పేర్కొంది. అర్ధాంతరంగా తాను తప్పుకోవడానికి గల కారణాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడిస్తారని చెబుతోంది. తదుపరి ప్రధానమంత్రి ఎవరనేది కూడా ఈ విలేకరుల సమావేశంలోనే షింజో అబే వెల్లడించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ఎందుకు వైదొలగబోతున్నారనడానికి ప్రధాన కారణం స్పష్టంగా తెలియరావట్లేదు. అనారోగ్య కారణం వల్లే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా షింజో అబే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని, అందుకే ప్రధానమంత్రి బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, అది మరింత విషమించిందని ఎన్హెచ్కే వెల్లడించింది.
షింజో అబే.. జపాన్కు యంగెస్ట్ ప్రధానమంత్రి. తొలిసారిగా ఆయన 2006 జులై 14వ తేదీన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు 52 సంవత్సరాలే. అప్పటి నుంచి ఆయనే ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా మూడుసార్లు ఆ పదవికి ఎన్నికయ్యారు. 2012 డిసెంబర్ 26వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ఘన విజయాన్ని సాధించింది. దీనితో ఆయన రెండోసారి ప్రధానమంత్రి పదవి పగ్గాలను అందుకున్నారు.
2014 డిసెంబర్ నాటి ఎన్నికల్లో ఆయన మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉత్తరకొరియా సంక్షోభం నేపథ్యంలో మరోసారి 2017 అక్టోబర్లో మరోసారి స్నాప్ ఎలక్షన్ను నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. తాజాగా- ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.