అమెరికా ఎన్నికల వేళ దుమారం రేపుతోన్న ట్రంప్ అల్లుడు వ్యాఖ్యలు..ఏం చెప్పారంటే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ను ఇరుకున పెట్టే కొన్ని టేపులు బయటకొస్తున్నాయి. దీంతో రిపబ్లికన్లకు ట్రంప్ గెలుపుపై ధీమా సన్నగిల్లుతోంది. ఏప్రిల్ నెలలో బాబ్ వుడ్వర్డ్ అనే ప్రముఖ జర్నలిస్టుకు ట్రంప్ అల్లుడు, వైట్ హౌజ్ సలహాదారుడు జేర్డ్ కుష్నర్ ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించి కొన్ని టేపులు విడుదలయ్యాయి. దీంతో ట్రంప్ క్యాంప్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఏప్రిల్ నెలలో కరోనావైరస్ అమెరికాలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి గురించి అప్పటికే ట్రంప్కు చాలామంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు సలహాలు ఇచ్చారు. ఇది ఎంత ప్రమాదకరంగా మారనుందో కూడా చెప్పారు. అయితే అలాంటి సలహాలు ఇచ్చిన డాక్టర్లను, శాస్త్రవేత్తలను ట్రంప్ ఉద్యోగం నుంచి తొలగించినట్లు కుష్నర్ చెప్పారు. అప్పటికే అమెరికాలో 40వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందడం జరిగింది. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ దాని తీవ్రతను తెలిసి కూడా ట్రంప్ పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 18న జరిగిన ఇంటర్వ్యూలో అమెరికా భయాందోళన పరిస్థితుల నుంచి బయటపడుతోందని చెప్పుకొచ్చారు. అంతేకాదు దేశం పురోగమనం దిశగా పయనిస్తోందంటూ గొప్పలు చెప్పుకున్నారు. ప్రభుత్వం ఇలా చెబుతూనే అన్ని కార్యాలయాలు తెరుచుకుంటాయంటూ ప్రజలు తమ విధులకు హాజరుకావొచ్చంటూ ఆదేశాలిచ్చిందని కుష్నర్ చెప్పారు.
కుష్నర్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు మహమ్మారిపై చేసిన హెచ్చరికలు పట్టించుకోకుండా ట్రంప్ మూర్ఖంగా వ్యవహరించడంతోనే అమెరికాలో నేడు అత్యధిక మరణాలు నమోదవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే అమెరికా ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రజలు ట్రంప్కు ఓటు వేస్తారా లేదా పక్కనబెడతారా అన్నది అమెరికా దేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తితో తిలకిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ట్రంప్ చుట్టూ ఉన్నవారంతా అతి తెలివి ప్రదర్శించే వారే అని వీరందరిని తొలగించి బాగా ఆలోచన చేసే వ్యక్తులను ట్రంప్ నియమించుకున్నట్లు కుష్నర్ చెప్పారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను ట్రంప్ మరియు కుష్నర్ చాలా చులకనగా చూశారని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇక కుష్నర్ ఇంటర్వ్యూ ఇచ్చే మూడు రోజులకు ముందు, రోజుకు 2600 మరణాలు నమోదయ్యేవి. ఇక ఆ సమయంలో ప్రభుత్వం కాస్త ఉదాసీనతతో వ్యవహరించిందని వైట్ హౌజ్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులు దేశంలోనే టాప్ ఇన్ఫెక్షియస్ డిజీస్ నిపుణులు అయిన డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు.
మొత్తానికి అమెరికా ఎన్నికల వేళ ట్రంప్కు కరోనావైరస్ ప్రాణసంకటంగా మారింది. కరోనావైరస్పై పోరుకు ట్రంప్ తీసుకున్న చర్యలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలే ఎవరూ ట్రంప్ నిర్ణయంతో సంతోషంగా లేరనే వాదన వినిపిస్తున్న సమయంలో ఇలాంటి టేపులు విడుదల కావడం ట్రంప్కు మరింత తలొనొప్పిగా తయారైంది.